Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం, గురువారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Telangana Weather Update Today | హైదరాబాద్ /అమరావతి: తెలంగాణలో భానుడి భగభగలకు బ్రేక్ పడనుంది. బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ వర్షాలతో తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్న సమయం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు, నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. గురువారం నాటికి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, దీంతో పాటు మరో 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల నుంచి 44.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. వర్షాలు పడితే ఈ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
Also Read: Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
కాగా, మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. తల్లాడలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, దమ్మపేటలో 3 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
🔴 ఏపీలో పలు జిల్లాలకి రెడ్ అలెర్ట్:
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 2, 2026
అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నంది pic.twitter.com/UNcgCROGHL
ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఒక ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షాలతో కొంత ఉపశమనం లభించనుంది. బుధవారం (జూన్ 3) నాడు గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో రెయిన్ అలర్ట్
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదముందని, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు. ఎండల తీవ్రత మంగళవారం సైతం కనిపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 44.9 డిగ్రీల మేర, పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















