Adilabad Crime News: ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో భారీ భూమి కబ్జా.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, బిజెపి నేత అరెస్ట్
Crime News in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఓ బీజేపీ నేత, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఓ బీజేపీ నేత కలిసి భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇందులో ఏకంగా సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకుని మరీ డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.
చాలా మంది పాత్రధారులు
ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూమి నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. ఇలా చాలా మంది పాత్రధారులుగా ఉన్నారు. అయితే, 'మెసేజ్ యువర్ ఎస్పీ' కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఆదిలాబాద్ కు చెందిన మిలింద్ కొర్తల్వార్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్లను ఈ ముఠా అక్రమంగా ఆక్రమించింది. ఈ ప్లాట్లకు సంబంధించిన అసలైన పత్రాలు బాధితుడి వద్ద ఉన్నా, నిందితులు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మోసానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్ కు రూ.7 లక్షలు ముట్టినట్లు చెబుతున్నారు. మిలింద్ కు సంబంధించిన ప్లాట్లను మళ్లీ రిజిస్టర్ చేసుకున్నారు.
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, బిజెపి నేత అరెస్ట్
ఫిర్యాదు అందగానే ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. జరిగిన మోసం గ్రహించిన పోలీసులు ఇందులో పాలు పంచుకున్న ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన బీజేపీ నేత, రైల్వే బోర్డు సభ్యుడు ఉష్కమొల్ల రఘుపతి, రిమ్స్ ఆయుష్ విభాగం ప్రభుత్వ ఉద్యోగి బెజ్జవార్ సంజీవ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు రూ.2 కోట విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ కాగా.. సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్ పరారీలో ఉన్నాడు. వీరిపై BNS 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్ పైన కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని పట్టుకుంటామని మావల సీఐ కర్ర స్వామి మీడియాతో వెల్లడించారు.
ఈ భారీ భూ కుంభకోణంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల పాత్రపైన ఆరా తీస్తున్నామని..? దీని వెనక ఎవరు ఉన్నా వదిలేది లేదని పోలీసులు వెల్లడించారు. ఇదే కాకుండా జిల్లాలో భూకబ్జాలు, రియల్ మోసాలు, అలాగే బెదిరించి భూములు లాక్కుంటే ప్రజలు పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.





















