PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Adilabad Ration Rice Racket: ఆదిలాబాద్ లో రేషన్ మాఫియా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యూపీకి తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

Adilabad PDS Smuggling : పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం.. చేతులు మారి సరిహద్దులు దాటుతోంది. నిరుపేదల నోటి కూడును కొల్లగొట్టి, ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు కుమ్మరిస్తున్న అంతర్రాష్ట్ర రేషన్ మాఫియా గుట్టును ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అధికారులు నాటకీయ పరిణామాల మధ్య రట్టు చేశారు. ఒకవైపు హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి, మరోవైపు ఆదిలాబాద్ రూరల్ పోలీసుల చాకచక్యమైన వాహన తనిఖీలతో.. కరీంనగర్ నుండి ఉత్తరప్రదేశ్ వరకు, ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర దాకా విస్తరించిన నల్లబజారు నెట్వర్క్ ఒక్కసారిగా కుప్పకూలింది.
యూపీ లారీని ముట్టడించిన టాస్క్ ఫోర్స్!
మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై అర్ధరాత్రి వేళ ఒక భారీ లారీ వేగంగా దూసుకుపోతోంది. అయితే, ఆ వాహనం కదలికలపై హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ముందే పక్కా సమాచారం అందింది. డీఎస్పీ శేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం నాటకీయ పద్ధతిలో ఆ లారీని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. అధికారులు లారీ వెనుక భాగాన్ని తెరిచి చూడగా.. బస్తాల కింద దాచి ఉంచిన సుమారు 28,000 కిలోలు ప్రభుత్వ రేషన్ బియ్యం బయటపడింది. ప్రాథమిక విచారణలో ఈ బియ్యాన్ని కరీంనగర్ నుండి ఏకంగా ఉత్తరప్రదేశ్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు నస్పూర్ ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఖిల్లా అద్దెగదిలో నల్ల నిల్వలు.. స్కూటీ తెచ్చిన ముప్పు!
ఇటు ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ బృందం సాధారణ వాహన తనిఖీలు చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక స్కూటీపై రెండు భారీ బస్తాలతో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో వారు షేక్ అఫ్సర్, ఎం.డి. రిజ్వాన్గా తేలింది. ఆ బస్తాల్లో ఉన్నది రేషన్ బియ్యమేనని గుర్తించిన పోలీసులు, వారి స్టైల్లో నిలదీసేసరికి అసలు రహస్యం బద్దలైంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఒక అద్దె ఇల్లు తీసుకుని, దాన్ని రేషన్ బియ్యం డంపింగ్ యార్డ్గా మార్చినట్లు వారు అంగీకరించారు. పోలీసులు తక్షణమే ఆ అద్దె గదిపై దాడి చేయగా.. అక్కడ 50 ప్లాస్టిక్ సంచుల్లో దాచిన మరో 25 క్వింటాళ్ల బియ్యం లభ్యమైంది.
రేషన్ డీలర్ల హస్తం .. బ్రాండెడ్ రైస్ ముసుగులో దందా!
ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా వెనుక ప్రభుత్వ వ్యవస్థలోని పురుగులే కీలక పాత్ర పోషించాయి. నిందితులు షేక్ అఫ్తాబ్, అబ్దుల్ సత్తార్లతో కలిసి పట్టణంలోని ముగ్గురు రేషన్ షాపు నిర్వాహకులు చేతులు కలిపారు. షాప్ నెం.15 నిర్వాహకుడు కొమ్ము రాము, షాప్ నెం.18 కి చెందిన అబ్దుల్ రహీమ్, షాప్ నెం.07 తో సంబంధం ఉన్న రాచేకర్ విలాస్.. పేదలకు ఇవ్వాల్సిన రాయితీ బియ్యాన్ని తక్కువ ధరకు ఈ ముఠాకు అమ్ముకున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కారుచీకట్లో మహారాష్ట్రకు చెందిన ఫరాన్ అనే వ్యక్తికి తరలించేవారు. అక్కడ ఈ రేషన్ బియ్యాన్నే పాలిష్ పట్టి, సరికొత్త సంచుల్లో నింపి, బ్రాండెడ్ రైస్ పేరుతో మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఏడుగురు జైలుకు.. ఒకరు పరారీ
ఈ వ్యవస్థీకృత రేషన్ దందాపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయగా, అందులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు, మహారాష్ట్ర లింక్ అయిన ఫరాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల నుండి మొత్తం 26 క్వింటాళ్ల బియ్యం, ఒక స్కూటీ, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులందరినీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండోవర్ చేస్తున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. పేదల బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, రేషన్ మాఫియాపై జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















