YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
జగిత్యాల జిల్లా కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తే అదనపు కట్నం కోసం వేధించి కత్తితో పొడిచి, గొంతు నులిమి హత్య చేశాడు.

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటుచేసుకుంది. నూరేళ్లూ కలిసి ఉంటామని బాసలు చేసుకుని, పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే ఓ గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. లవ్ మ్యారేజీ చేసుకున్న తరువాత నుంచి అత్తారింట్లోనే ఉంటున్న వ్యక్తి తన భార్యను హత్య చేశాడని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (19)ని ఆమె భర్త హరిబాబు అత్యంత కిరాతకంగా గొంతు నులిమి, కత్తితో పొడిచి హత్య చేశాడు. వైష్ణవి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా హరిబాబు చేసిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా, మంగళవారం వైష్ణవి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించారు. అర్ధరాత్రి ఓసారి అరుపులు విని అత్తామామలు వెళ్లి చూడగా కూతురు, అల్లుడు నిద్రపోతున్నట్లు కనిపించడంతో తిరిగి వారి గదికి వచ్చి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే కూతురు దారుణహత్యకు గురైందని తెలిసి వైష్ణవి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నమ్మి కూతుర్ని చేతిలో పెడితే ఇంత దారుణం చేశాడంటూ రోదించారు.

ఘటనా స్థలానికి వెళ్లిన డీఎస్పీ రాములు, సీఐ సురేశ్బాబు, ఎస్సై చిరంజీవి వైష్ణవి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా వరకట్నం కోసం హరిబాబు వైష్ణవిని శారీరకంగా, మానసికగా వేధిస్తున్నాడని, ఈ క్రమంలోనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వివాదం ముదరడంతో, హరిబాబు విచక్షణ కోల్పోయి వైష్ణవి గొంతు నులిమాడని, ఆపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, సోషల్ మీడియా వీడియోల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని ప్రచారం జరిగింది. వైష్ణవి ఒక యూట్యూబర్ కావడంతో, వ్యూస్ కోసం హరిబాబుకు వేరే మహిళతో సంబంధం ఉన్నట్లుగా కొన్ని వివాదాస్పద వీడియోలను చిత్రీకరించారు. వీరిద్దరూ వ్యూస్ కోసమే ఇలా చేశారా.. లేక భర్త చేసే తప్పులను ఎత్తిచూపేందుకు వైష్ణవి వీడియో పోస్ట్ చేసిందా క్లారిటీ లేదు. తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉన్న ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టవద్దని హరిబాబు భార్య వైష్ణవిని హెచ్చరించాడని.. ఆమె లెక్క చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ముదిరి, చివరకు అది హత్యకు దారితీసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు..
మరోవైపు, హరిబాబు అదనపు కట్నం కోసం కూడా వైష్ణవిని వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో అత్తగారి ఇంట్లోనే ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం నిందితుడు బైకుపై పరారయ్యాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవి హత్యకు వ్యూస్ కోసం పోస్ట్ చేసిన వీడియోలు కారణమా.. లేక వరకట్నం కోసం వేధించి హత్య చేశాడా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
























