Telangana Politics: నేడు మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నిక.. కీలకంగా ఎక్స్ అఫీషియో ఓట్లు
Municipal Mayor Election | రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, డిప్యూటీ మేయర్లను, అలాగే 116 మున్సిపాలిటీలకు ఛైర్పర్శన్లు, వైస్ ఛైర్మెన్లను ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికల ప్రక్రియతో ఎన్నుకుంటారు.

Telangana Municipal Chairman Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లు, 116 మున్సిపాలిటీలకు ఛైర్పర్సన్లను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 16న (నేడు) రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎక్స్ అఫీషియో, కో ఆప్షన్ ఓట్లు కీలకం కానున్నాయి.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం సమావేశ మందిరంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరించాలని నిబంధన విధించారు. కలెక్టర్ల అనుమతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కూడా చేయనున్నారు. ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ఎటువంటి ప్రయత్నాలను హాల్ లోపల అనుమతించబోరు. వేదికపై కేవలం ఎన్నికల అధికారి, పరిశీలకుడు మాత్రమే ఉంటారు.
ముఖ్యంగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఎక్స్-అఫీషియో సభ్యుల కోసం ప్రత్యేక సీటింగ్ కేటాయించారు. రాజకీయ పార్టీల సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులకు విడివిడిగా సీట్లు కేటాయించి, ప్రతి గ్రూపు ముందు గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేశారు. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కీలక ఎన్నికలను పూర్తి చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
లోక్ సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు: సంబంధిత మున్సిపాలిటీ పరిధి పూర్తిగా లేదా కొంత భాగంగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండాలి. అప్పుడే ఎక్స్ అఫీషియో ఓటు వేయవచ్చు. అయితే సంబంధిత నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉంటేనే ఓటు వేసే వీలుంటుంది. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఓటింగ్ ఉంటే ఒకేచోట మాత్రమే ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. రెండుచోట్ల కో ఆప్షన్ ఓటు వినియోగించుకునే అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ హవా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఏకపక్ష విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కాగా, 38 పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 'హంగ్' ఏర్పడింది.
ఇక 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 4 కాంగ్రెస్కు, 2 బీజేపీకి దక్కాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం విశేషం. వార్డుల వారీగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 1,347 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా నిలిచింది. డివిజన్ల స్థాయిలోనూ కాంగ్రెస్ 191 చోట్ల గెలిచి అగ్రస్థానంలో నిలవగా, బీజేపీ 77 డివిజన్లతో రెండో స్థానంలో నిలిచింది.
మున్సిపల్ ఎన్నికల తుది బలాబలాలు
1. వార్డుల వారీగా ఫలితాలు:
కాంగ్రెస్ 1,347
బీఆర్ఎస్ (BRS) 716
బీజేపీ (BJP) 261
ఇతరులు (MIM, CPI, CPM, Ind) 257
2. డివిజన్ల వారీగా ఫలితాలు (మొత్తం 414):
కాంగ్రెస్ 191
బీజేపీ (BJP) 77
బీఆర్ఎస్ (BRS) 63
ఇతరులు 83
























