![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !
September 17 Hyderabad Liberation Day: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేసేది లేదని ప్రకటించారు. చివరకు ఆపరేషన్ పోలోతో భారత్లో నిజాం రాజ్యం విలీనమైంది.
![Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా ! Telangana Liberation Day 2022 Lesser Known History About Operation Polo in Hyderabad Telangana Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/16/d84240cdba0682397493b68ad60460b41663322012017233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినా.. హైదరాబాద్ రాష్ట్రం (ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు)లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేసేది లేదని ప్రకటించారు. ఏడాది పాటు వేచి చూసిన భారత ప్రభుత్వం తప్పని పరిస్థితులలో నిజాం రాజ్యంపై పోలీసుల చర్యకు సిద్ధమైంది. హైదరాబాద్ రాజ్యం ప్రత్యేక దేశం కాదు కనుక సైనిక చర్యకు బదులుగా పోలీసు చర్య (Operation Polo) చేపట్టి భారత్లో కలిపేశారు. నిజాం రాజ్యం అంటే.. ప్రస్తుత తెలంగాణతోపాటు మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి.
దేశంలో ప్రత్యేకమైన సంస్థానాలివే..
స్వాతంత్ర్యం సమయంలో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్యం ఇస్తూనే ఆయా సంస్థానాలు ఇండియాలో కలపాలో వద్దో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానాలు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. మొదట కాశ్మీర్ ను రాజా హరి సింగ్ భారత్లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆపై జునాఘడ్ సంస్థానాన్ని భారత్లో కలిసేలా చేశారు అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు ఆపరేషన్ పోలో చర్యకు ప్లాన్ చేశారు సర్దార్ పటేల్.
ఆపరేషన్ పోలో
1948లో జూలై చివరి వారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. కశ్మీర్ సమస్య, రుతుపవనాల సమస్యతో దాడి వాయిదా పడింది. హైదరాబాద్ రాజ్యాంపై సైనిక చర్య నిర్వహిస్తున్నప్పటికి ప్రత్యేక దేశం కాదు కనుక పోలీస్ చర్య (Operation Polo) అని నామకరణం చేశారు. నిజాం రాజ్యంలో పోలో గ్రౌండ్లు ఎక్కువగా ఉంటాయి. దీన్నే ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు.
సెప్టెంబర్ 13న మొదలైన పోలీస్ చర్య..
నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయ 4 గంటలకే మెుదలైంది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైఋతిలో రాయచూరు నుంచి ఒకేసారి ఆపరేషన్ పోలో మెుదలైంది. దక్షిణ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ జి.ఓ.సి పర్యవేక్షణలో భారత సైనిక దళాలు నలువైపుల నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని ముట్టడించాయి. సెప్టెంబర్ 13న మెుదటగా నల్ దుర్గ్ పట్టణం దగ్గర ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని భారత సైన్యం ఆక్రమించింది. రెండు గంటల్లోనే 25 ఫాండర్ల ఫిరంగులు యూనియన్ సైనికుల హస్తగతమైంది. విజయవాడ, షోలాపూర్ నుంచి వ్యూహాలు రచిస్తూ ఎక్కువగా దాడులు జరిగాయి. సైన్యం అడుగులు ముందుకు పడ్డాయి.
మేజర్ జనరల్ వి.వి రుద్ర విజయవాడ నుంచి సైన్యంతో బయలుదేరి.. పాలేరు నదిని దాటి నల్లబండ గూడెం వైపు నుంచి ముందుకు వచ్చారు. హైదరాబాద్, విజయవాడకు ఓన్లీ ట్రంక్ టెలిఫోన్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. యూనియన్ సైన్యాన్ని నిజాం మిలటరీ ఎదురించలేకపోయింది. అయితే సూర్యాపేట దగ్గరలోని దురాజ్ పల్లి క్యాంపు చాలా పెద్దది. నిజాం సైనికులు, రజాకార్లు ఎంతగానో పోరాడినా ఫలితం లేకపోయింది. ఉండ్రుగొండ కోటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న నిజాం మిలటరీ, రజాకారులపై భారత సైన్యం బాంబుల వర్షం కురిపించి సత్తా చాటింది.
నిజాం ప్రభువు రేడియోలో ప్రకటన
యూనియన్ సైన్యం పటాన్ చెరువు ప్రాంతానికి రాగా, తన ఓటమి తప్పదని పూర్తిగా అర్థమయ్యాక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేశాడు. యూనియన్ సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైనికులు, రజాకార్లు టేకుమట్ల దగ్గర ఉన్న మూసీ వంతెనను పేల్చాయి. దాంతో సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకునేందుకు ఓరోజు ఆలస్యమైంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం సికింద్రాబాద్ చేరింది. మంత్రివర్గం రాజీనామాతో పాలన పగ్గాలు నిజాం ప్రభువు తీసుకున్నారు. దక్కన్ రేడియో నుంచి తమ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైందని ప్రకటన చేశారు ఏడో నిజాం.
'నా ప్రియమైన ప్రజలారా.. మన ప్రభుత్వం రాజీనామా చేసింది. భారతదేశపు గవర్నర్ జనరల్ హిజ్ ఎక్స్ లెన్సీ రాజగోపాలా చారి పేరిట సందేశాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైంది.. నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించాను. భారత సైన్యం బొల్లారం, సికింద్రాబాద్ లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతిస్తున్నాను. పరిపాలనలో కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు నాకు సహాయపడేందుకు ఓ కమిటీని నియమించానని’ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియో ద్వారా సందేశం ఇచ్చారు.
చివరికి నిజాం సైన్యాధిపతి ఎల్ డ్రూస్.. మేజర్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొనసాగారు. ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, ఖాశీం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. ఆపరేషన్ పోలో పూర్తయ్యాక సర్దార్ వల్లభాయ్ పటేల్ బేగంపేట విమానాశ్రయానికి రాగా, నిజాం ఘనస్వాగతం పలికారు. భారత్లో విలీనం చేసినట్లు చెప్పారు. రాజ ప్రముఖ్గా నియమించగా.. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన ఆ పదవి కోల్పోయారు.
Also Read: Hyderabad Liberation Day: ఏకకాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై పోరాడిన హైదరాబాద్, యుద్ధం మొదలైంది ఇక్కడే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)