హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును కొట్టేస్తూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు మరియు ర్యాంకులు సక్రమమని, నియామకాలు యధాతథంగా కొనసాగవచ్చని తీర్పునిచ్చింది.
TGSPSC Group -1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు భారీ ఊరట; నియామకాలు సక్రమమేనని తేల్చి చెప్పిన హైకోర్టు!
TGSPSC Group -1: తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థులకు ఊరట కల్పించే తీర్పును హైకోర్టు వెల్లడించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది.

TGSPSC Group -1: తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న గ్రూప్-1 నియామకాల ప్రక్రియపై ఎట్టకేలకు న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఈ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాలు, ర్యాంకుల విషయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న 563 మంది అభ్యర్థుల భవిష్యత్పై ఉన్న నీలినీడలు తొలగిపోయాయి.
సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ బ్రేక్
గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్, మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితాను , మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అన్ని పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా సాధ్యం కాకపోతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ నియామకాలు సక్రమమేనని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఎక్కడా అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
కోర్టులో కీలక వాదనలు
విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి పేపర్ను ఇద్దరు వ్యక్తుల చేత మూల్యాంకనం చేయించినట్టు ఆయన కోర్టుకు వివరించారు. పరీక్షా కేంద్రాల సంఖ్య పెరగడం, పరిపాలనాపరమైన వెసులుబాటు కోసమే ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లు జారీ చేశామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్టు ఎటువంటి ఆరోపణలు లేవని ఆయన గుర్తు చేశారు.
అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి, పరీక్షల్లో అర్హత సాధించలేని వారే కోర్టుకు ఆశ్రయించారని ఆరోపించారు. రెండు హాల్టికెట్ల విధానం గురించి పరీక్షకు ముందే కమిషన్ వెల్లడించినప్పకీ, అప్పుడు స్పందించని అభ్యర్థులు ఫలితాలు వచ్చాక అభ్యంతరాలు తెలపడం చెల్లదని ఆయన వాదించారు.
అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు
ఈ తీర్పు జనవరి 22నే వెలువడాల్సి ఉన్నప్పటికీ తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో ధర్మాసనం దీనిని వాయిదా వేసింది. ఎట్టకేలకు గురువారం వెలువడిన ఈ తీర్పుతో 563 మంది అభ్యర్థుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ మెయిన్స్ పరీక్షపై పడిన న్యాయపరమైన చిక్కులను తాజా తీర్పుతో వీడిపోయాయి.
Frequently Asked Questions
TGSPSC గ్రూప్-1 నియామకాల విషయంలో హైకోర్టు ఏమి తీర్పునిచ్చింది?
సింగిల్ జడ్జి గతంలో ఏమి ఆదేశించారు?
మార్చి 10న తుది మార్కుల జాబితా, మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయాలని, మూల్యాంకనం తిరిగి చేయాలని లేదా పరీక్షను మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి ఆదేశించారు.
కోర్టులో టీజీపీఎస్సీ తరపున ఏ వాదనలు వినిపించబడ్డాయి?
మూల్యాంకనంలో అవకతవకలు జరగలేదని, ప్రతి పేపర్ ను ఇద్దరితో మూల్యాంకనం చేయించామని, వేర్వేరు హాల్ టికెట్లు పరిపాలనా సౌలభ్యం కోసమే అని వాదనలు వినిపించారు.
ఈ తీర్పు వల్ల ఎంతమంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది?
ఈ తీర్పుతో ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న 563 మంది అభ్యర్థుల భవిష్యత్ పై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.






















