Phone Tapping Case: మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం
Former MP Santosh Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులలో సిట్ పేర్కొంది.

Phone Tapping Case: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మంగళవారం (జనవరి 27న) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. గత BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రశ్నించేందుకు సిట్ సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వడం, వారు అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హరీష్ రావును సుమారు 7 గంటలకు పైగా విచారించిన అధికారులు, ఆ తర్వాత కేటీఆర్ విచారణకు హాజరుకాగా స్టేట్మెంట్ తీసుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో జోగినల్లి సంతోష్ రావు పాత్రపై సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ ఎంపీకి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
ముదురుతున్న రాజకీయ సెగ.. సిట్ విచారణలో బీఆర్ఎస్ అగ్రనేతలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించడమే కాకుండా, బీఆర్ఎస్ అగ్రనేతలను విచారిస్తోంది. గులాబీ పార్టీ నేతలకు వరుస నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
నేతలపై ప్రధాన ఆరోపణలు
రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నేతలపై ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి, వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారనే ఫిర్యాదులు సిట్కు అందాయి. సిరిసిల్ల కేంద్రంగా ఒక ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేసి నిఘా నిర్వహించారని, దీని కోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సాఫ్ట్వేర్ కొనుగోలుకు పార్టీ నిధులను మళ్లించారని సెట్ అనుమానాలు వ్యక్తం చేసింది.
ఆధారాలు ధ్వంసం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ మార్పు సమయంలో కీలకమైన డేటా, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ ఎస్ఐబీ (SIB) అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పలువురు పోలీసు అధికారులు బెయిల్ రావడంతో విడుదలయ్యారు.
సిట్ దర్యాప్తు తాజా పరిణామాలు
మాజీ మంత్రి హరీష్ రావును ఇటీవల సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. ఆయనను ఈ కేసులో ఒకవైపు నిందితుడిగా, మరోవైపు బాధితుడిగా (ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆధారాలు) అధికారులు భావిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం ఈ కేసులో సిట్ అధికారులు కేటీఆర్, హరీష్ రావులను సాక్ష్యులుగా మాత్రమే విచారించారని, అయితే ఎందుకు భయపడుతున్నారని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ విచారణ
హరీష్ రావు తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. పార్టీ ఆర్థిక లావాదేవీలు, ఎలక్టోరల్ బాండ్లు, ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ కొనుగోలు అంశాలపై ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారని సమాచారం. తాజాగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. జనవరి 27న తాను విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నారు.
























