Srushti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం.. డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాల్లో కోట్ల నగదు గుర్తింపు
Surrogacy case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఖాతాలో భారీగా నగదు లావాదేవీలను గుర్తించారు దర్యాప్తు అధికారులు. సరోగసి పేరుతో మోసం చేసి కోట్లలో వసూలు చేశారు.

Doctor Namratha Srushti Fertility Clinic: సరోగసి పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన మోసాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాాజాగా మరో ఐదుగురు బాధితులను సరోగసి పేరుతో మోసం చేసి గట్టిగానే వసూలు చేశారని తేలింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో పాటు ఎన్ ఆర్ ఐలను సైతం నిండా ముంచేశారని తాజాగా బయటపడింది. ఇదిలా ఉంటే నమ్రతా బ్యాంక్ ఖాతాలతోపాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు భారీగా నగదు బదిలీలు జరిగినట్లుగా గుర్తిచారు.
ముగియనున్న నమ్రత కస్టడీ
సికింద్రాబాద్ లో సృష్టిఫెర్టిలిటీ సెంటర్ (Surrogacy case) మోసాలను రాజస్దాన్ దంపతులు బయటపెట్టిన నాటి నుండి వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే నమ్రతను ఐదురోజుల కస్టడీకి తీసుకున్న గోపాలపురం పోలీసులు, నేటితో కస్టడి గడువు ముగియనుండంతో కస్డడీ పొడిగించాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. మొదటి రోజు పోలీసులు కస్టడీ ముగిసిన తరువాత బయటకు వస్తూ ,తానే తప్పు చేయలేదని, రాజస్దాన్ దంపతులు బిడ్డను దత్తత అడిగితే ,ఏర్పాటు చేశామంటూ చెప్పింది కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత. కానీ ఆ తరువాత వేగంగా జరగుతున్న పరిణామాలు నిందితురాలు నమ్రత కావాలనే కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణలో సహకరించని డాక్టర్ నమ్రత
ఐదురోజుల పాటు పోలీసు కస్టడిలో డాక్టర్ నమ్రత , పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. చెప్పిందే చెప్పడం,తాను తప్పు చేయలేదని నమ్మించేే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో డాక్టర్ విజ్జులతను విదేశాలకు పారిపోతుండగా CISF పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విజ్జులతకు లుక్ అవుట్ నోటీసులిచ్చిన పోలీసులు ,పాస్ పోర్టు ఎంట్రీ ఆధారంగా గుర్తించి, విదేశాలకు పారిపోకుండా ఆపగలిగారు. డాక్టర్ నమ్రతతో కలసి సరోగసి, ఐవిఎఫ్ లను విజ్జులత నిర్వహించేవారని తేలింది. సరోగసి కోసం వచ్చే దంపతుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నమ్రత తనపై ఎవరికీ అనుమానం రాకుండా , సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనుమతులు విజ్జులత పేరుతో తీసుకున్నట్లుగా విచారణలో తేలింది.
బ్యాంక్ ఖాతాల్లో భారీ నగదు లావాదేవిలు
తాజాగా నమ్రతతోపాటు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన అధికారులు, 2019 నుండి 2025 మధ్య భారీగా వీరి ఖాతాలో నగదు క్రెడిట్ అయినట్లుగా గుర్తించారు. దాంతో వీరి బ్యాంక్ ఖాతాలను కూడా ఫీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు రాజస్దాన్ దంపతులు మాత్రమే బయటకు రాగా, తాజాగా మరో ఐదుగురు బాధితులు తామూ సరోగసి పేరుతో నమ్రతా చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. సరోగసి పేరుతో నల్గొండకు చెందిన దంపతుల వద్ద నుండి 11 లక్షలు వసూలు చేయగా, ఓ ఎన్ ఆర్ ఐ వద్ద నుండి 19లక్షలు తీసుకున్నారు.
హైదరాబాద్ లో ఓ జంట వద్ద నుంచి 16.5లక్షలు వసూలు చేశారు. మరో జంట వద్ద 12.5 లక్షలు వసూలు చేశారు. పిల్లలు లేని దంపతులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు వస్తే చాలు , సరోగసి వద్దు, ఐవిఎఫ్ ముద్దంటూ మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఓవైపు డాక్టర్ నమ్రతను విచారిస్తూనే, కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులను కూడా వేరువేరుగా విచారిస్తున్నారు. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లలో వరుస తనిఖీలు నిర్వహించిన పోలీసులు ,పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.





















