Hyderabad Metro Train: పెను సవాలుగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గం! సున్నితంగా పట్టాలెక్కడం సాధ్యమేనా?
Hyderabad Metro Train: హైదరాబాద్లో ఈ చివరి నుంచి ఆ చివరను కవర్ చేసిన మెట్రో ఓల్డ్ సిటీ వైపు మాత్రం వెళ్లలేకపోయింది. సవాళ్లను అధిగమిస్తూ ఇప్పుడు చార్మినార్ వైపుగా దూసుకెళ్లేందుకు సిద్దమైంది.

Hyderabad Metro Train: హైదరాబాద్లో మెట్రో రైలు పట్టాలెక్కిన నాటి నుంచి నగరంలో ట్రాపిక్ రూపురేఖలే మారిపోయాయి. మెట్రో నడిచే మార్గాల్లో అభివృద్ది సైతం అంతే వేగంగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ ప్రభావం సైతం ఊహించని స్థాయికి చేరింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పెరిగిన ఉపాధి అవకాశాలు.. ఇలా ఒక్కమాటలో చెప్పాలంటే మెట్రో ఏర్పాటుకు ముందు హైదరాబాద్, ఏర్పాటు తరువాత హైదరాబాద్ అనేంతలా నగరంలో ఊహించని మార్పులు చకచకా జరిగిపోయాయి.
ఫేజ్ వన్లో నగరంలోని ప్రధాన మార్గాలను కలుపుతూ మెట్రో స్టేషన్ల నిర్మాణం జరిగింది. దాదాపు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండే ప్రాంతాల్లో మెట్రో ఏర్పాటుతో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు చాలావరకూ తగ్గాయి. అయితే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఏరియా మీదుగా మాత్రం మెట్రో ఏర్పాటు జరగలేదు. రాజకీయ, ఆర్ధిక కారణాలతో మెట్రోకు ఇన్నాళ్లు మోక్షం కలగలేదు. తాజాగా మెట్రో ఏర్పాటుకు మోక్షం లభించడంతో ఓల్డ్ సిటీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో నిర్మాణం మొదటి దశలోనే ఓల్డ్ సిటీ మీదుగా లేన్ వేసేందుకు సన్నాహాలు జరిగాయి. అప్పట్లో ఎంజీబిఎస్ నుంచి ఫలక్నూమా వరకూ 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరిగాయి. కానీ కొన్ని రాజకీయ పరిణామాలు, ప్రభుత్వంపై ఒత్తిడితో ఓల్డ్ సిటీ మెట్రోకు మోక్షం లభించలేదు. రేవంత్ రెడ్డి సర్కారు అధికారం చేపట్టిన తరువాత తాజాగా ఒల్డ్సిటీలో మెట్రోనిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మెట్రో రూట్లో స్వల్ప మార్పులు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఫైనల్గా ఎంజీబిఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకూ 7.5 కిలోమీటర్ల మార్గంలో నాయా మెట్రో నిర్మాణానికి చకచక చర్యలు తీసుకుంటోంది. ఈ మార్గంలో మెట్రో నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే 1100పైగా ప్రైవేటు ఆస్తులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీటిలో 205 ఆస్తులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. మెట్రో ఏర్పాటుతో భూములు, ఆస్తులు కోల్పోతున్న, నిర్మాణాలు పాక్షికంగా ధ్వంసమవుతున్న కుటుంబాలను గుర్తించి వారికి 212కోట్ల రూపాయలు చెల్లించారు.
మెట్రో నిర్మాణానికి ముందు ఓల్డ్ సిటిలో రోడ్లు విస్తరించే పనిలో పడింది ప్రభుత్వం. ఇందులో భాగంగా విద్యుత్ లైన్లు, టెలిఫోన్ కేబుళ్లను తొలగించి లైన్ క్లియర్ చేస్తున్నారు. మెట్రో అధికారులతోపాటు పోలీస్, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పనులు వేగంగా సాగుతున్నాయి. విస్తరణ పూర్తైన వెంటనే కేంద్రం అనుమతి తీసుకుని మెట్రో నిర్మాణ పనులు మరింత వేగవంతం చేస్తారు.
ఓల్డ్సిటీలో మైనార్టీ, హిందూ మతాలు సెంటిమెంట్కు ముడిపడిన ప్రార్థనాస్థలాలు, ఆస్తులు కీలకంగా మారాయి. చారిత్రాత్మక కట్టడాలకు మతపరమైన స్థలాలకు ఇబ్బందిలేకుండా విస్తరణ పనులు చేయడమనేది మెట్రో్ సిబ్బందికి పెను సవాలుగా మారింది. విస్తరణలో భాగంగా అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలిగించడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మెట్రో సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
మెట్రో మార్గం విస్తరణలో భాగంగా 1100 ఆస్తులను తొలిగించాల్సి ఉంది. వీటిలో స్వచ్చందంగా ముందుకు వచ్చిన అధికారులకు సహకరించే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతావారిని ఒప్పించి ,రోడ్ల విస్తరణ చేయడం ప్రభుత్వానికి ఎదురయ్యే మరో ఛాలెంజ్. ఇవన్నీ సమస్యాత్మక ప్రాంతాలు కావడం మరో సమస్య. అందుకే ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది.
స్వచ్చంధంగా ఆస్తులను మెట్రో నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ ప్రభుత్వం స్థానికులను కోరుతోంది. అవగాహన కల్పిస్తోంది. ఇలా భూసేకరణ సవాళ్లు అధిగమించి, మెట్రో రైలును ఓల్డ్ సిటీలో పట్టాలెక్కించడమే ఇప్పుడు అధికారుల ముందు ఉన్న బిగ్ ఛాలెంజ్.
మెట్రో నిర్మాణానికి భూసేకరణ అడ్డంకులు తొలగి, సాధ్యమైనంత వేగంగా మెట్రో నిర్మాణం పూర్తైతే ఓల్డ్ సిటీ రూపురేఖలు మారిపోతాయి. ఆర్థిక అభివృద్దితోపాటు రియల్ ఎస్టేట్ పీక్స్కు చేరుకుంటుంది. కొత్తగా నిర్మించబోతున్న ఎంజీబిఎస్ టూ చంద్రయాణగుట్ట మెట్రో మార్గంలో మొత్తం నాలుగు మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఎంజీబీఎస్ నుంచి మొదలైన మెట్రో రైలు సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నూమా స్టేషన్ల మీదుగా చంద్రాయణగుట్ట చేరుకుంటుంది. మెట్రో అందుబాటులోకి వస్తే ఓల్డ్ సిటీవాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్లే. పర్యాటకుల తాకిడి పెరిగి టూరిజం మరింతగా అభివృద్ది చెందుతుంది.





















