KTR Latest News: నా ఫోన్ ఇవ్వడం కుదరదు: ఏసీబీకి కేటీఆర్ లేఖ
KTR Latest News:

KTR Latest News: తెలంగాణలోని ఫార్ములా ఈ కేసులో ఫోన్ ఇవ్వడ కుదరదని ఏసీబీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తాను చాలా మొబైల్స్ మార్చానని వాటిని ఇవ్వడానికి కుదరని చెప్పేశారు. ఈ కేసులో గతంలో వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ నోటీసు ఇచ్చింది. దీనిపై స్పందించిన కేటీఆర్ ఇవాళ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కు వచ్చి స్వయంగా విచారణకు హాజరయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణకు అన్ని రకాలుగా ఏసీబీ విచారణకు పూర్తి సహకారం అందించిన విషయాన్ని కేటీఆర్ ఈ ప్రస్తావించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు లేవనెత్తిన అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విషయాన్ని కేటీఆర్ వెల్లడించారు.
ఫార్ములా రేసు కేసులో ఈ నెల 16న విచారణ పూర్తైన తరువాత బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 ప్రకారం తనకు మరో నోటీసును అందించారని, అందులో తాను నవంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 1,2023 వరకు వాడిన మొబైల్ ఫోన్, ల్యాప్ ట్యాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు కేటీఆర్ తెలిపారు. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వాడిన సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు సమర్పించాలనే కారణం చెప్పలేదన్నారు. ఉద్దేశం పేర్కొనలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఫార్ములా కేసు విచారణకు సంబంధించి అవసరమైన అన్నిరకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలని చెప్పారు. ఫిర్యాదులో తనపై చేసిన ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ, వాటిని సమర్పించాలని కోరడం అంటే రాజ్యాంగం ఒక పౌరుడిగా తనకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని కేటీఆర్ సమాధానం చెప్పారు. కేసు విచారణ కోసం తాను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమనే ప్రాతిపదికను ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు.
విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో సేకరించే ఎలక్ట్రానిక్ వస్తువులను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
వ్యక్తిగత గోప్యతతోపాటు, విచారణ పేరుతో ఒక పౌరుడి నుంచి ఎందుకు తీసుకుంటున్నారు సరైన కారణం చెప్పకుండా, సేకరించిన సమాచారాన్ని ఆయనకే వ్యతిరేకంగా వాడడం సరైనది కాదు అనే రైట్ ఎగైనెస్ట్ సెల్ఫ్-ఇంక్రిమినేషన్ అనేవి అత్యంత ముఖ్యమైనవని, వాటికి భంగం కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు సూచించిందని పేర్కొన్నారు.
ఇదే అంశంలో రిట్ పిటిషన్ దాఖలు చేసిన పిటీషనర్ కి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఆ కేసులో రెస్పాండెంట్గా ఉన్న ఈడీకి, పౌరుడి మొబైల్ ఫోన్ను వాడటంకానీ, అందులోని సమాచారాన్ని కాపీ చేయడం కానీ చేయవద్దని కూడా స్పష్టం చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. వివిధ దర్యాప్తు సంస్థలు విచారణలో భాగం చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల కేసులు అనేకం కోర్టులో పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. 2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.





















