![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Venkaiah Naidu: అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు.
![Venkaiah Naidu: అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: వెంకయ్యనాయుడు Ex Vice President Venkaiah Naidu Advices Against Resorting To Political Vendetta Venkaiah Naidu: అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: వెంకయ్యనాయుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/8c6730d227f2c25a873b1e064ac5dc251696494389033754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Venkaiah Naidu: అధికారం శాశ్వతం కాదని, ప్రత్యర్థులను వేధించొద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగింది. ఈ సభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై.. సమకాలీన రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండకూడదని సూచించారు. దుర్భాషలాడే నేతలకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు.
ద్వేష పూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొంత మంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్నీ అసభ్య పదాలేనని వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలు గమనించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని సూచించారు.
'10 శాఖలకు మంత్రిగా ఉండీ మచ్చ లేకుండా కొనసాగారు'
అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తాను, దివంగత జైపాల్రెడ్డి ముఖ్యమంత్రులపై ఎన్ని విమర్శలు చేసినా అవి విషయానికి లోబడే ఉండేవని, ఇప్పుడు ఆ స్థాయి విమర్శలను సహించే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. దేవేందర్ గౌడ్ ఆదర్శవంతమైన నాయకుడన్న ఆయన.. పది శాఖలకు దేవేందర్ గౌడ్ మంత్రిగా పని చేసినా ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగారని అన్నారు. పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాలను తీసుకొచ్చినట్టు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేవేందర్ గౌడ్ చేసిన ప్రసంగాలు, సభ్యుల ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలతో తీసుకువచ్చిన ఈ పుస్తకాలను చదివినప్పుడు, వారు ఎంత హుందాగా, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారో అర్థం అవుతుందని అన్నారు.
'దేశంలో, రాష్ట్రంలో గట్టి ప్రతిపక్షం ఉండాలి'
'ఉప రాష్ట్రపతి కంటే వెంకయ్య నాయుడుగా నన్ను గుర్తిస్తేనే నాకు ఎక్కువ ఆనందం. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను. ప్రజా జీవనంలో ఉన్నాను. పార్టీలు, రాజకీయాలపై వ్యాఖ్యానించను. ఎప్పుడూ పార్టీని చూడొద్దు. విషయాన్ని, ప్రాధాన్యతను చూడాలి. వెనకబడిన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. రాజకీయాల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డ వ్యక్తి ఎన్టీఆర్. దేవేందర్ గౌడ్ తన విలువైన అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసహప్యంగా ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నాయకులను ఎన్నుకోవాలి. సత్తా ఉన్న నాయకులను ఎంచుకోవాలి. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. దేశంలో, రాష్ట్రంలో గట్టి ప్రతి పక్షం ఉండాలి. బలమైన ప్రతి పక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది' అని వెంకయ్య నాయుడు చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)