Kavita Latest News: "బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం" కవిత సంచలన వ్యాఖ్యలు
Kavita Latest News: బీసీ రిజర్వేషన్కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ విషయంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడంతోనే తేలిపోయందన్నారు కవిత. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Kavita Latest News: బీఆర్ఎస్పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని అధికారికంగా ప్రకటించారని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న వారి నోటి కాడ ముద్ద లాక్కున్న బుట్టంగారి మాధవ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో స్పష్టమైందన్నారు. ఆయనకు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబెట్టి తాము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్ఎస్ రాజముద్ర వేసి చెప్పిందన్నారు. అలా కాదనుకుంటే ఆ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నో రోజులు పోరాటం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని వివరించారు. కానీ బుట్టంగారి మాధవ్ రెడ్డి సహా మరొక వ్యక్తి దీనిపై పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. అంటే ఈ కేసును బీఆర్ఎస్ వేయించిందా? బీసీల రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఈ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీష్ రావుకి చాలా దగ్గర వ్యక్తి అని తెలిపారు. హరీష్ రావు పర్సనల్ లాయర్ ఈ కేసు వేయించారని ఆరోపించారు. అప్పుడు దీని వెనుక ఉన్నది హరీష్ మాత్రమే అని విమర్శించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వటం కారణంగా దీని వెనుక బీఆర్ఎస్ మొత్తం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.
బీఆర్ఎస్ అసలు బీసీల విషయంలో చిత్తశుద్దితో లేదని ధ్వజమెత్తారు కవిత. పార్టీ పరంగా కూడా వాళ్లు మీటింగ్ పెట్టలేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ పేరుతో మాత్రమే మీటింగ్లు పెట్టారని తెలిపారు. జనగణనన విషయంలో కూడా ముందు కన్ఫ్యూజ్ చేశారని, తర్వాత మళ్లీ జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అంతా రోడ్లపైకి వస్తే కానీ వాళ్ల మీటింగ్ లు కార్యరూపం దాల్చలేదిని వివరించారు. అందుకే బీసీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని గమనించాలని కవిత విజ్ఞప్తి చేశారు. బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియేనని తెలిపారు. హరీష్ రావు ఆయనను తప్పుదోవ పట్టించి కేసు వేయించారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ తినలేదని చెప్పుకొచ్చారు కవిత. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారికి మునిసిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్లు నియమించారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా చేస్తే, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్ రావును కూడా తమ పార్టీ ఇన్ఛార్జ్ల జాబితాలో చోటు కల్పించారని అన్నారు. వీళ్లంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ ప్రకటిస్తే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లుగా ఎన్నికల బాధ్యతలు అప్పగించిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాలు పట్టుకొని తిరగడం కాదని, కాంగ్రెస్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సూచించారు.
ఇప్పటి వరకు పాలన చూసిన ప్రజలంతా తమతో కలిసి వస్తున్నారని కవిత అన్నారు. కొన్ని పార్టీలు కలిసి వచ్చాయని తెలిపారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున సింహం గుర్తుపై కొందరు పోటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రశ్నించే తమలాంటి వాళ్లతోపాటు సీపీఎం, న్యూ డెమాక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఈ నెల 12 న నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ వాదులు హాజరుకావాలని ఆహ్వానించారు.





















