Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Telangana Rains | తెలంగాణలో బుధవారం నాడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా, ఎండ తీవ్రత అధికంగా ఉన్న 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

Hyderabad Rains | హైదరాబాద్: తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వరుణుడు కరుణించి భానుడి ప్రతాపం నుంచి ఊరట కలిగించాడు. తెలంగాణలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి భారీగా వర్షాలు కురిశాయి. దాంతో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల పంట తడిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో నిప్పుల కొలిమి.. వడదెబ్బకు 29 మంది బలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. భానుడి భగభగలకు రాష్ట్రంలోనూ వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వడదెబ్బ ప్రభావానికి తట్టుకోలేక మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం నాడు గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 125 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటేశాయి. బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్లో వర్షం..
నగరంలో మంగళవారం అర్ధరాత్రి తరువాత నుంచి వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ఐటీ కారిడార్తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, దిల్సుఖ్ నగర్, కోఠి, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ నివాస ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
MAJOR THUNDERSTORM WARNING ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) May 26, 2026
Dear people of Telangana, there will be one spell of MAJOR THUNDERSTORM in many parts of South, Central, West, Telangana (especially RED districts) during May 26-27 (Next 48hrs)
The CORE HOTSPOT will be Central, South TG districts with WIDESPREAD… pic.twitter.com/4VLlhsPunT
తెలంగాణ వెదర్మ్యాన్ వాతావరణ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 24 గంటలపాటు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో (ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో) ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం నాడు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఖమ్మంలోని రఘునాథపాలెం, కొణిజర్ల, తల్లాడ, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, బోనకల్, కల్లూరు వంటి పలు ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 43-46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయి, హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కొన్ని జిల్లాల్లో 50- 60 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగుపాటు ప్రమాదాలు ఉన్నాయి కనుక అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, పిడుగులతో పాటు అక్కడక్కడా తుఫాను వాతావరణం ఏర్పడతుంది. 30 మిల్లీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది
వడదెబ్బకు 45 మంది మృతి
తెలంగాణలో ఎండల తీవ్రత ప్రజలను భయపెడుతోంది. భానుడి భగభగలకు వడగాలులు తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంగళవారం ఒక్కరోజే వడదెబ్బతో 45 మంది మృతిచెందారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మంది వడదెబ్బకు చనిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఐదుగురు, ఉమ్మడి కరీంనగర్లో నలుగురు, ఉమ్మడి నల్గొండలో ఇద్దరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. రాత్రివేళ సైతం ఉక్కపోత, వేడి కారణంగా నిద్రపట్టక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో ఎండల తీవ్రత త్వరగా తగ్గేలా కనిపించడం లేదు. బుధవారం కూడా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో 10 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా ఉదయం 11 తరువాత నుంచి మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















