రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Telangana CM Revanth Reddy | తెలంగాణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒకటే తేదీనే జీతాలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- గ్రామ పంచాయతీ సిబ్బందికి నెల 1నే జీతాలు అందేలా చర్యలు.
- జీతాల చెల్లింపునకు నెలకు రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు.
- గ్రామ పంచాయతీల స్వయంప్రతిపత్తి పెంచేందుకు నిబంధనల మార్పు.
- పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు, నేరుగా ఖాతాల్లో జమ.
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉండే ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి ఏ విధంగానైతే వేతనాలు అందుతాయో, అదే రీతిలో క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక నిధులు మంజూరుకు నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం తరఫున ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా అందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని అధికారులకు కరాఖండిగా చెప్పారు. సిబ్బంది జీతాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని, పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం, గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని (Own Source Revenue) ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల స్థానిక సంస్థలకు నిధుల వినియోగంలో స్వేచ్ఛ లభిస్తుంది.
కొత్త పెన్షన్లు మంజూరుపై ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విధానంలో పారదర్శకతను పెంచేందుకు, లబ్ధిదారుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా ప్రస్తుత విధానంలో కీలక మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటివరకు పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి, ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులను జమ చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్లు కేవలం అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలని, అందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల అధికారిక డేటా, SEEEPC సర్వే సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. అర్హులకు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు?
గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంత నిధులు మంజూరు చేస్తుంది?
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు గాను ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ఏ విధంగా జమ చేయాలని సీఎం ఆదేశించారు?
గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని సీఎం ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయనుంది?
ఇప్పటివరకు పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న పెన్షన్ల పంపిణీ విధానాన్ని మార్చి, ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులను జమ చేయాలని నిర్ణయించారు.
ట్రెండింగ్ వార్తలు























