Telangana Municipal Elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం - కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయరు- నిజామాబాద్లో సీఎం రేవంత్ ప్రశ్న
CM Revanth : బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం అని సీఎం రేవంత్ నిజామాబాద్లో విమర్శించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావును ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

BJP and BRS have fevical relationship: నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు ఉన్న ఘన చరిత్రను గుర్తు చేస్తూ.. మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి వంటి నిష్కళంక నేతలు ఇక్కడ పనిచేశారని కొనియాడారు. అయితే, పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ సమస్యలు పరిష్కారం కాకపోగా, నగరం చెత్తకుప్పగా మారిందని మండిపడ్డారు. నిజామాబాద్ రైతుల ఆత్మగౌరవ పోరాటం దేశానికే ఆదర్శమని, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే ఇక్కడ పంటలు పండుతున్నాయని ఆయన గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఇప్పటికే విద్యాసంస్థలకు రూ. 600 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 1045 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా నిజామాబాద్ను కనీసం స్మార్ట్ సిటీ పథకంలోకి ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. గల్లీలో మోరీలు తీయాలన్నా మోదీ రావాలా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావులను జైలులో పెడతామని ప్రగల్భాలు పలికే అర్వింద్, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారి కేసీఆర్ను కాపాడుతున్నారని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్కు ఓటు వేసినా అది మూసీ నదిలో వేసినట్లేనని ఓటర్లను హెచ్చరించారు.
తనను బీజేపీ నేతలు రేవంతుద్దీన్ అని పిలవడంపై సీఎం ఘాటుగా స్పందించారు. కులగణన చేసినందుకు రేవంత్ గౌడ్ అని, వర్గీకరణకు పరిష్కారం చూపినందుకు రేవంత్ మాదిగ అని, ముదిరాజ్, యాదవ, సిక్కు సోదరులకు అండగా ఉన్నందుకు ఆయా పేర్లతో పిలిచినా తాను సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు. అన్ని మతాలను, కులాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రకటించారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందనడానికి షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి నేతలకు కల్పించిన పదవులే నిదర్శనమని పేర్కొన్నారు. తనను రేవంతుద్దీన్ అని పిలిచినా తనకు ఎలాంటి అభ్యంతర లేదని, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు వాళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. ఆ బంధం విడదీయరానిది. బీజేపీకి వేసినా, బీఆర్ఎస్ కు వేసినా ఆ ఓట్లు మూసీ నదిలో కలిపినట్టే..
— Telangana Congress (@INCTelangana) February 6, 2026
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు@revanth_anumula pic.twitter.com/rOMsVPd75a
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా లక్షలాది కొత్త రేషన్ కార్డులు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 8 ఏళ్లు అధికారంలో ఉంటుందని, నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గడిదకు గడ్డి వేసి ఆవు దగ్గర పాలు పిండలేమని, అభివృద్ధి జరగాలంటే కార్పొరేషన్లలో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.























