Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు
AP CM Chandrababu | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు.

అమరావతి : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. బీజేపీ తమ మద్ధతు కోరితే ఆలోచిస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.
తెలంగాణ నేతలతో చంద్రబాబు కీలక భేటీ
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో మంగళగిరిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తరువాత పార్లమెంట్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు.

పార్టీని యాక్టివ్ చేయాలని కోరిన నేతలు
తెలంగాణలో టీడీపీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి... గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర నాయకులు చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ లోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు త్వరలోనే కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కంభంపాటి రమ్మోహన్, నందమూరి సుహాసిని, ఆశోక్ గౌడ్, జోత్స్న, పోగాకు జైరామ్, వాసిరెడ్డి రామనాధంతో పాటు పలువురు హాజరయ్యారు.























