Bharat Bundh Live News: భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది... రైతు సంఘాలు ప్రకటన
తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్కు సంబంధించి జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఈ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. భారత్ బంద్కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్కు సంబంధించి జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
భారత్ బంద్ ప్రశాంతం
దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంజాబ్లోని అమృత్సర్లో రైతులు రైల్వే ట్రాక్లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్తక్, కర్నాల్ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.
వైసీపీ బంద్కు మద్దతివ్వడాన్ని తప్పుబట్టిన బీజేపీ
నెల్లూరు జిల్లా కావలిలో భారత్ బంద్ ప్రశాంతంగా మొదలైంది. కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం, పార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పెట్రోలు డీజల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మోదీ, అమిత్ షా.. దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజలను అదాని, అంబానీలకు తాకట్టు పెట్టేలా చట్టాలను చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార వైసీపీ బంద్కి మద్దతివ్వడాన్ని బీజేపీ తప్పుబట్టింది.





















