Breaking News: తిరుమలలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
నేడు ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాల అప్ డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం.

Background
మహారాష్ట్రలో సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్ కేసులో విచారణ అధికారి సమీర్ వాంఖడేను దర్యాప్తు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్సీబీ ప్రకటించిందని కథనాలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో వాంఖడే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను దర్యాప్తు టీమ్ నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులు మాత్రమేనని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై నేరుగా అధికారి సమీర్ వాంఖడే స్పందించారు. తనను ముంబై డ్రగ్స్ కేసుతో పాటు ఇతర కేసుల విచారణ బాధ్యతల నుంచి తనను ఎవరూ తప్పించలేదని తెలిపారు. అయితే తనపై ఆరోపణలు వస్తున్నందున ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే స్పష్ట చేశారు. తన పిటిషన్కు స్పందనగా ముంబై డ్రగ్స్ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని సమీర్ వాంఖడే వెల్లడించారు.
ఉప ఎన్నికల ఫలితాల ప్రభావమో, లేక కొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయనే ముందుచూపుతో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించింది. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా దిగొచ్చాయి. తాజాగా కొన్ని నగరాల్లో ధరలలో వ్యత్యాసం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.86.67కు దిగొచ్చింది.
కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్లో ఇంధన ధరలు తగ్గాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 అయింది. డీజిల్ ధర లీటరుకు 12 రూపాయలు తగ్గడంతో రూ.94.62గా ఉంది. ఇక వరంగల్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపుగా ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి సందర్భంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు దీపావళి నుంచి పెరుగుతున్నాయి. బంగారం దారిలోనే వెండి పయనిస్తోంది. తాజాగా రూ.160 మేర పుంజుకోవడంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,700 గా ఉంది. ఇక వెండి ధర రూ.900 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.68,600 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నేటి ఉదయం 11:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకు నూతన భవనం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు అటవీ భూముల సమస్యలపై అధికారులతో కలిసి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రాను అదానీ రాష్ట్రంగా మార్చేస్తున్నారు : పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మారుస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరుగుతుందని, అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
తిరుమలలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
నవంబరు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. తిరుపతిలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న కారణంగా నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.





















