Breaking News Live: ఏపీ శాసన మండలి ఛైర్మన్ కు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ దాఖలు చేసిన మోషేన్ రాజు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలనే డిమాండ్తో గురువారం తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతాయి. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొంటారు. వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు ప్రదర్శన అనంతరం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పిస్తారు.
మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ మరోసారి తనలోని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి మియాపూర్కు చెందిన పవన్, నగేష్ శామీర్పేట నుంచి మియాపూర్ వైపునకు వెళ్తుండగా, హకీంపేట నిషా వద్ద బైక్ నుంచి జారి కిందపడ్డారు. అదే మార్గం గుండా వెళ్తున్న మంత్రి కేటీఆర్ గమనించి తన కాన్వాయ్ను పక్కకు నిలిపారు. వారిని తన ఎస్కార్ట్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
నేటి ఇంధన ధరలు ఇవీ..
హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్లో పెట్రోల్ ధర రూ.0.27 పైసలు తగ్గింది. దీంతో తాజా ధర రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.25 పైసలు తగ్గి రూ.94.14గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా పెరిగింది. లీటరుకు రూ.0.28 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.109.79 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.13 పైసలు పెరిగి రూ.96.44గా ఉంది.
నేటి బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.71,500గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,500 గా ఉంది.
ఏపీ శాసన మండలి ఛైర్మన్ కు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ దాఖలు చేసిన మోషేన్ రాజు
ఏపీ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలు దువ్వాడా శ్రీనివాస్, బల్లి చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించారు. శుక్రవారం(నవంబర్ 19న) మండలి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
జనగామ జిల్లాలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి చెందాడు. చెట్టు ఎక్కేందుకు వినియోగించే తాడు తెగిపోవడంతో గీత కార్మికుడు బైరగొని శ్రీనివాస్ కిందపడిపోయాడు. 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన బైరగొని శ్రీనివాస్( 28) రోజు వారీగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేందుకు వినియోగించే తాడు తెగిపోవడంతో ఒక్క సరిగా కింద పడ్డాడు. యువకుడైన శ్రీనివాస్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.





















