Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Andhra Pradesh Weather | అకాల వర్షాలు కురుస్తున్నా భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. వడదెబ్బతో తెలంగాణలో గురువారం నాడు ఏడుగురు మృతిచెందారు.

Telangana Heatwave | హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఒకవైపు అకాల వర్షాల కారణంగా వడదెబ్బ మరణాలు చాలా వరకు తగ్గడం ఊరట కలిగిస్తోంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరోవైపు భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేడు (శుక్రవారం), శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం నాడు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. శనివారం నాడు ఈ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వడగాలులు తీవ్రంగా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తీవ్రమైన ఎండల సమయంలోనే రాష్ట్రంలో వర్ష సూచన ఉంది. శుక్ర, శనివారాల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల్లో కదలికలు ప్రారంభమయ్యాయని, బంగాళాఖాతంలో ఇవి పైకి కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD వెల్లడించింది.
46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. వడదెబ్బకు ఏడుగురు మృతి
గురువారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఎండలు దంచికొట్టాయి. బుధవారం వాతావరణం కొంత చల్లగా అయినట్లు అనిపించినా, గురువారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపు 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటేశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలో పెరిగిన ఈ వడదెబ్బ కారణంగా గురువారం ఒక్కరోజే 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు చనిపోగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు వడదెబ్బకు గురై మృతి చెందారు.
🔴APSDMA హెచ్చరిక ☀⛈
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 28, 2026
రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ గారు తెలిపారు.
రేపు 🔸79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది. pic.twitter.com/aPGKRj5yva
ఆంధ్రప్రదేశ్లో వడగాల్పుల తీవ్రత.. 79 మండలాల్లో హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఆందోళనకరంగా మారుతోంది. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 79 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 152 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ప్రస్తుతం జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఎండలతో పాటు అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మే 29 నాడు మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















