Smartphones Expensive: భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Laptops More Expensive | మీరు కనుక స్మార్ట్ఫోన్, PC కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. త్వరలో RAM వాడే అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Smartphone Price Hike | మీరు 2026లో కొత్త స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ లేదా PC కొనుగోలు చేయాలని చూస్తున్నారా, అయితే అదనపు ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇందుకు కారణం మనం తరచుగా పట్టించుకోని ఒక భాగమైన RAM. ఒకప్పుడు చౌకైనదిగా భావించే RAM ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. ఇది దాదాపు ప్రతి డిజిటల్ పరికరం ఖర్చులపై ప్రభావం చూపుతుంది.
RAM ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరిగాయి?
అక్టోబర్ 2025 నుంచి భారత్తో పాటు పలు దేశాలలో RAM ధరలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. చాలా సందర్భాలలో, కంపెనీలకు మునుపటి కంటే 4 నుండి 5 రెట్లు ఎక్కువ ధరలు చెబుతున్నారు. ఈ పెరుగుదలకు ఒక్క కారణం అని చెప్పలేం. పలు అంశాల కారణంగా రామ్ అవసరమయ్యే అన్ని పరికరాల ధరలు పెరిగాయి. దీనికి అతిపెద్ద కారణం AI సాంకేతికత వేగంగా విస్తరించడం అని నిపుణులు చెబుతున్నారు.
AI, డేటా సెంటర్స్ సమతుల్యతను దెబ్బతీశాయి
నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని అమలు చేయడానికి పెద్ద డేటా కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్స్ అధిక పనితీరు గల సర్వర్లు, ప్రత్యేక రకం మెమరీ, వేగవంతమైన టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. ఇందులో RAM వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. AI వినియోగం పెరిగేకొద్దీ ప్రపచం వ్యాప్తంగా RAM డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. సమస్య ఏమిటంటే RAM సరఫరా ఆ వేగంతో పెరగలేదు. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ఇవి చిన్న ఖర్చులు కాదు, పెద్దవి
బీబీసీ నివేదిక ప్రకారం, సాంకేతిక కంపెనీలు తరచుగా చిన్న ఖర్చులను భరిస్తాయి. దాంతో కస్టమర్లపై ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ పెట్టుబడి చాలా పెరిగినప్పుడు, దాని భారం చివరికి కస్టమర్పై పడుతుంది. కంప్యూటర్లను తయారు చేసే అనేక కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను పెంచకుండా ఉండటం దాదాపు అసాధ్యమని చెబుతున్నాయి. ఒక PC తయారీదారు ప్రకారం, ఇటీవల కొన్ని RAM భాగాల కోసం 500 శాతం వరకు ఎక్కువ ధరలను కోట్ చేశారు. కంపెనీలకు లాభాలను తగ్గించుకోవడం లేదా ఉత్పత్తుల ఖర్చు పెంచడం ఏదో ఒకటి చేయక తప్పదు.
ప్రతి పరికరంపై ప్రభావం
RAM అనేది పరిమితమైనది కాదు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, స్మార్ట్ టీవీలు, వైద్య పరికరాలు దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలోనూ ఉపయోగిస్తారు. మెమరీ ఖరీదైనదిగా మారితే, దాని ప్రభావం మొత్తం మార్కెట్పై కనిపిస్తుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే స్టాక్ను సిద్ధం చేసుకున్నాయి. కానీ తక్కువ ఇన్వెంటరీ ఉన్న తయారీదారులు 4 నుండి 5 రెట్లు ధరలను పెంచారు.
2026 వరకు ద్రవ్యోల్బణం
సాంకేతిక పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం RAM ధరలలో ఈ పెరుగుదల 2026 వరకు కొనసాగుతుంది. 2027 వరకు కూడా పరిస్థితులు సవాలుగా మారతాయి. AI కోసం ఉపయోగించే హై-ఎండ్ మెమరీ మొత్తం మార్కెట్ను ప్రభావితం చేసింది. దీంతో సాధారణ వినియోగదారులకు సైతం RAM ఖరీదైనదిగా మారింది. క్లౌడ్ సేవలను అందించే పెద్ద కంపెనీలు ఇప్పటికే 2026, 2027 అవసరాలను అంచనా వేశాయి. దీని వలన RAM తయారు చేసే కంపెనీలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, సరఫరా పరిమితంగా ఉందని గుర్తించారు.
ఖర్చులను భరించలేకపోతున్న కంపెనీలు
ఒక సాధారణ ల్యాప్టాప్లో, RAM మొత్తం వ్యయంలో దాదాపు 15 నుండి 20 శాతం ఉంటుంది. ప్రస్తుత ధరలతో ఇది 30 నుండి 40 శాతం వరకు పెరిగింది. కనుక కంపెనీలు ఇంత పెద్ద వ్యయాన్ని భరించలేవు. కొంతమంది సరఫరాదారులు ధరల గురించి కోటేషన్ ఇవ్వడం మానేశారు. ఇది రాబోయే రోజుల్లో మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని సూచిస్తుంది.
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఎంత ఖరీదు అవుతాయి
16GB RAM ఉన్న సాధారణ ల్యాప్టాప్ తయారీ ఖర్చు 2026లో 40 నుండి 50 డాలర్లు పెరగవచ్చు. స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, ఒక ఫోన్ ధర దాదాపు 30 డాలర్లు పెరగవచ్చు. దాంతో స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ ధరలు అదే స్థాయిలో పెరగనున్నాయి.
























