![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR National Party : జాతీయ పార్టీపై టీఆర్ఎస్ సైలెంట్ - దసరాకు లేకపోతే ఇక లేనట్లే !?
దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
![KCR National Party : జాతీయ పార్టీపై టీఆర్ఎస్ సైలెంట్ - దసరాకు లేకపోతే ఇక లేనట్లే !? KCR would announce a national party on Dussehra. But TRS sources say that there is no such thing now. KCR National Party : జాతీయ పార్టీపై టీఆర్ఎస్ సైలెంట్ - దసరాకు లేకపోతే ఇక లేనట్లే !?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6ba6b9ad9655efe3a370d88dbf0b24f51664300510585228_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KCR National Party : జాతీయ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితిలో మళ్లీ స్తబ్దత నెలకొంది. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని ఇతర రాష్ట్రాల నుంచి గత వారం రోజులుగా ఎవరూ రావడం లేదు. ఎవరైనా ఆసక్తి చూపినా టీఆర్ఎస్ వర్గాలు వెయిట్ చేయమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సమీకరణాలు చూసినా.. ఎలా లెక్కలేసినా.. ఎటు వైపు నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే పది రోజుల కిందట ఉన్న జోరు ఇప్పుడు లేదని చెబుతున్నారు.
తగ్గిన "దేశానికి కేసీఆర్ నాయకత్వం" కావాలనే డిమాండ్ !
ఇతర రాష్ట్రాల నుంచి పలువురు సీనియర్ నతలు వచ్చారు. ప్రగతి భవన్లో భేటీ తర్వాతకేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కోరస్గా చెబుతున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులంతా అర్జంట్గా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని తీర్మానం చేశారు. కేసీఆర్ కూడా ప్రగతి భవన్ వేదికగానే దాదాపుగా కసరత్తు పూర్తి చేశారు. ఇక ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో .. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
దసరాకు ఎలాంటి జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన లేనట్లే !
కేసీఆర్ అన్ని రకాల కసరత్తులు పూర్తి చేశారని దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్ నేతలు నమ్మారు. కానీ ఎలాంటి పార్టీ ప్రకటన ఉండటం లేదని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఏదీ కలసి రాకపోవడంతో పాటు ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థల దూకుడు ఎక్కువైపోయింది. రాష్ట్రంలో అవినీతిపై ఏదైనా కేసులు పెడితే కక్ష సాధింపు.. తెలంగాణ ఆత్మ గౌరవం పేరుతో ప్రజల్లోకి వెళ్లవచ్చు కానీ… ఢిల్లీ లిక్కర్ కేసుల్లో ఇప్పుడు తెలంగాణ నేతలు ఇరుక్కున్నారు. ఓ ఆడిటర్పై ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చాలా మంది టీఆర్ఎస్ నేతల హవాలా దందా బయటపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఈడీ విరుచుకుపడుతుందో తెలియదు. అసలు ఇప్పటి వరకూ ఎలాంటి కేసుల్లోనూ వినిపించని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.
కాంగ్రెస్ వైపు చూస్తున్న కేసీఆర్తో కలిసి వచ్చే నేతలు
ఇక జాతీయ రాజకీయాలలలో ధర్డ్ ఫ్రంట్ అంటూ ఉండదని … ఉండేది కాంగ్రెస్ కూటమేనని కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని.. ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం అని ప్రకటించిన ఎవరూ ..ఢిల్లీలో ఆయనతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఎంత కసరత్తు చేసినా అనుకున్న విధంగా హైప్ రాకపోవడం.. ఇప్పుడు తెలంగాణను వదిలేసి ఢిల్లీ వెళ్తే.. మొదటికే మోసం వస్తుందన్న అంచనాతో కేసీఆర్ .. జాతీయ పార్టీ విషయాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తెలంగాణపైనే కేసీఆర్ దృష్టి !
తెలంగాణలో హ్యాట్రిక్ సాధిస్తే దేశ రాజకీయాల్లో వచ్చే క్రేజ్ సహజంగానే వస్తుందని.. ముందు తెలంగాణలో విజయంపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ క్యాడర్ బహిరంగంగానే చెబుతూంటారు. ఇప్పుడు పరిస్థితులు కలసి రావడం లేదు కాబట్టి కేసీఆర్ కూడాఅదే బాటలో నడిచే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ఈ లోపు పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించి.. ప్రభుత్వ వ్యతిరేకత అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టగిలిగితే హ్యాట్రిక్ ఖాయమని నమ్ముతున్నారు.
అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం. ఆయన సైలెంట్గా ఉన్నారంటే.. రాజకీయంగా పేలిపోయే వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారని అనుకోవాలి. ఆయన ఎటువంటి అడుగులు వేస్తారన్నది దసరాకు ముందే తేలిపోయే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)