![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?
త్వరలో విశాఖనే రాజధానిగా ప్రకటిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ వ్యూహమేంటి ?
![AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ? CM Jagan's comments that he will soon declare Visakhapatnam as the capital are causing a stir politically. AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/31/f52e084d86178c928929906e40f618671675175350157228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Capital issue : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో ఏపీ రాజధాని ప్రస్తావన తీసుకు రావడం.. విశాఖకే తరలి వెళ్తున్నామని అక్కడే పెట్టుబడులు పెట్టాలని పిలుపునివ్వడం రాజకీయ సంచలనంగా మారింది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన క్యాంప్ ఆఫీస్ మార్చుకోవచ్చు కానీ అది రాజధాని ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కోర్టులో తీర్పు రాకుండా ఎలా రాజధాని మార్చగలరని మరికొందరు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇవన్నీ సీఎం జగన్ కు తెలియనివేమీ కావు. మరి ఎందుకు ఈ ప్రకటన చేశారు ? సీఎం జగన్ ప్రకటన వెనుక రాజకీయ వ్యూహం ఉందా ?
కోర్టులో ఉన్న అంశంపై సీఎం జగన్ ప్రకటన !
ఏపీ రాజధాని అంశం ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉంది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ప్రస్తుతం రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉది. ఇది అత్యంత క్లిష్టమైన కేసుగా న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనుకోగానే రాజధాని మార్పు చేయలేరు. ఎందుకంటే రాజధాని పేరుతో 29వేల మంది నుంచి ప్రభుత్వమే భూములు సమీకరణ చేసింది. వారికి అనేక వాగ్దానాలు చేసింది. అవి నేరవేర్చకపోతే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం రాజధానిని మార్చాంటే.. ఈ సమస్యలను అధిగమించాలి. సుప్రీంకోర్టులో దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చిన తర్వాతనే రాజధానిని మార్చగలరా లేదా అన్నది తేలుతుంది. కానీ సీఎం జగన్ మాత్రం సుప్రీంకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నట్లుగా ప్రకటించడం సంచలనంగా మారింది.
రాజకీయంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారా ?
విశాఖ రాజధాని అంశంపై విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఏపీలో రాజధాని అంశం పూర్తిగా చల్లబడిపోయింది. రాజధానిరైతులు పాదయాత్రను విరమించారు. వైఎస్ఆర్సీపీ కూడా మూడు రాజధానుల ఉద్యమం చేయడం లేదు. ఈ క్రమంలో మరోసారి రాజధాని అంశం చర్చకు రావడం రాజకీయంగా అవసరం అన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్లను వ్యూహాత్మకంగా ఢిల్లీలో చేశారని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఫోకస్ అవడానికే ఈ ప్రకటన చేశారని.. అదే రాష్ట్రంలో చేసి ఉంటే.. రాష్ట్రంలో మాత్రమే చర్చనీయాంశం అయ్యేదని అంటున్నారు. పెట్టుబడిదారుల్లో ఉన్న మూడు రాజధానుల డైలమాను.. జగన్ తీర్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ ను మారిస్తే రాజధాని మారిపోతుందా ?
సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలన్నది సీఎం ఇష్టమని పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. ఆ సిద్ధాంతం ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నికోర్టులు కూడా అడ్డుకోలేవు. కానీ శాఖల్ని మాత్రం మార్చలేదు. అమరావతినే రాజకీయంగా రాజధానిగా ఉంటుందని అంటున్నారు. విశాఖ నుంచి జగన్ పరిపాలన చేసుకోవచ్చు కానీ అది రాజధాని కాదని అంటున్నారు. అన్ని న్యాయపరమైన చిక్కులు పరిష్కరించుకున్న తర్వాత మరో బిల్లు పెట్టి ఆమోదించుకున్న తర్వాతనే మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని సాధ్యమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
డైవర్షన్ రాజకీయం అని తీవ్ర విమర్శలు
మరో వైపు ఇటీవల రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఘటనల్ని దృష్టి మళ్లించడానికే.. సీఎం జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కారణం ఏదైనా మరోసారి రాజధాని అంశం హాట్ టాపిక్ అయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)