AP Local Elections: ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?
YS Jagan local body elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కాకూడదని, అక్రమ తొలగింపులపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

AP Local Body Unanimous elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ ముసురుకున్న సందేహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరదించారు. తాడేపల్లి వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్, కార్పొరేషన్ , పంచాయతీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, వైఎస్ జగన్ సమరశంఖం పూరించారు. గెలుపోటముల కంటే ప్రజాస్వామ్యబద్ధంగా ‘పోటీ’లో నిలబడటమే అత్యంత ముఖ్యమని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఒక్క స్థానాన్ని కూడా కూటమి పార్టీలకు ఏకగ్రీవం కాకుండా చూడాలని, ప్రతిచోటా గట్టి పోటీ ఇవ్వాలని ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేయడం ద్వారా తన పట్టుదలని చాటుకున్నారు.
పులివెందుల ఫలితం తర్వాత మారిన లెక్కలు
ఇటీవల పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీకి ఆశించిన ఫలితం రాలేదు. అక్కడ డిపాజిట్ దక్కకపోవడంతో పార్టీ నైతికంగా కొంత ఒత్తిడికి లోనైంది. కూటమి ప్రభుత్వం అధికార బలంతో నామినేషన్లను అడ్డుకుంటోందని, తమ పార్టీని పోటీ చేయకుండా అణిచివేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పార్టీలోని కొందరు పెద్దలు భావించినప్పటికీ, జగన్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే పోటీ తప్పదని ఆయన గ్రహించారు.
ఏకగ్రీవాల అపవాదు నుంచి బయటపడేలా..:
గత వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు జరిగాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేనలు.. వైసీపీ భౌతిక దాడులు . బెదిరింపులతో నామినేషన్లు వేయనివ్వలేదని తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు అదే తరహా కూటమి పార్టీలు కూడా అదే తరహా వ్యూహం పాటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే, ఈసారి ప్రతి సీటులోనూ అభ్యర్థులను నిలబెట్టాలని, ఎవరైనా నామినేషన్లు అడ్డుకుంటే లీగల్ సెల్ ద్వారా పోరాడాలని నిర్ణయించారు. దీని ద్వారా గతంలో తమపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు.
క్యాడర్ బలోపేతమే పరమావధి
ఒక రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే కింది స్థాయి కార్యకర్తలు నిర్వేదంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఐదేళ్ల రాజకీయం స్థానిక నేతలపైనే ఆధారపడి ఉంటుంది. పోటీ చేయకపోతే గ్రామ స్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు జగన్ పోటీ అస్త్రాన్ని ఎంచుకున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ప్రజల పక్షాన నిలబడి ఓట్లు అడగాలి అన్నది జగన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
కూటమికి గట్టి సవాల్
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వానికి కూడా సవాల్గా మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఈ ఎన్నికలు నిరూపిస్తాయి. టీడీపీ, జనసేన తమ పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే, వైసీపీ తన ఉనికిని చాటుకోవాలని తాపత్రయపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి. గెలుపు గుర్రాలు ఎవరనేది పక్కన పెడితే, ఏకగ్రీవాలు లేకుండా హోరాహోరీగా సాగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తాజా నిర్ణయం వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అనేది వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















