US Iran War: అమెరికన్లను సముద్రంలో ముంచేస్తాం! అంత సీన్ లేదన్న డొనాల్డ్ ట్రంప్ !
US President Trump: ఇరాన్ నేవీతో పాటు సైనిక శక్తిని నిర్వీర్యం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం తనవల్లే ఆగిందన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ (Mojtaba khamenei ) హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త రూల్స్ తీసుకొస్తామని తెలిపారు. తమ అణు, క్షిపణి సామర్థ్యాలను రక్షించుకుంటామని పేర్కొన్న ఆయన.. పర్షియన్ గల్ఫ్కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్న సమయంలో ఇరాన్ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి మోజ్తబా ఖమేనీ ఒక లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేయగా ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు ఉన్న ఏకైక స్థలం ఆ సముద్రపు అగాధాలేనని తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. దేవుని సహాయం, తమ శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అమెరికా లేని ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని లేఖలో తెలిపారు. ఇక్కడి ప్రజల పురోగతి, శ్రేయస్సుకు కృషి చేస్తానన్నారు.
మేం, పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్కు అవతల ఉన్న మా పొరుగువారు ఒకే పనిని పంచుకుంటున్నామని అన్నారు. వేల కిలోమీటర్ల దూరం నుండి దురాశ, ద్వేషంతో ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఈ ప్రాంతంలో చోటు లేదు. వారిని సముద్రంలో ముంచేస్తామని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన
అమెరికా నేవీ దిగ్బంధనం చేసి ఇరాన్ ఓడలను సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్న సమయంలోనే మొజ్తబా ఖమేనీ లేఖ వచ్చింది. ఇరాన్ చమురు వ్యాపారంపై గత కొన్ని రోజులుగా ఒత్తిడి పెరిగింది. గురువారం ట్రేడింగ్లో జూన్ డెలివరీ కోసం బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 126 డాలర్లకు చేరుకుంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే దీనికి కారణం. దీనికి ఎలా సమాధానం చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.
హర్మూజ్లో అమెరికా దిగ్బంధనం ఉద్దేశం ఏమిటి?
హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ దిగ్బంధనం ఉద్దేశం ఇరాన్ తన చమురును విక్రయించకుండా అడ్డుకోవడం, వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం. తద్వారా ఆ దేశానికి కీలకమైన రాబడి వనరు లేకుండా చేయాలనేది ట్రంప్ ప్లాన్. అలాగే, ఇరాన్ చమురు ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితిని తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే చమురును నిల్వ చేయడానికి వారికి చోటు ఉండదు.
ఇరాన్తో ఉద్రిక్తత.. యుద్ధంగా భావించడం లేదన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు ఇరాన్కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలను తాను యుద్ధంగా పరిగణించడం లేదని పేర్కొన్నారు. ఈ చర్యలో ఇరాన్ నేవీ, వాయు సేన భారీగా నష్టపోయాయని, ఇప్పుడు ఆ దేశం ఒప్పందం కోసం ఆత్రుతగా ఉందని పేర్కొన్నారు. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. ఇరాన్ సైనిక సామర్థ్యం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయిందని క్లెయిమ్ చేశారు. ఇరాన్ డ్రోన్ తయారీ సామర్థ్యం సుమారు 82 శాతం తగ్గిందని, వారి అణు కార్యక్రమం కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు.
భారత-పాకిస్తాన్ సంబంధాల ప్రస్తావన
ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ ప్రస్తావించారు. ఇప్పటివరకు 8 ప్రధాన యుద్ధాలను తాను సద్దుమణిగేలా చేశానని, ఇందుకుగానూ పలు దేశాలు తనకు కృతజ్ఞతా లేఖలు పంపాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను టారిఫ్ లను ఆయుధంగా ఉపయోగించానని ట్రంప్ చెప్పారు. యుద్ధం కొనసాగితే కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. తన జోక్యం వల్లే సంభవించబోయే భారీ నష్టాన్ని నివారించానని పేర్కొన్నారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనం
ఇరాన్ పట్ల అమెరికా తన కఠిన వ్యూహాన్ని కొనసాగిస్తుందని అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనం సమర్థవంతంగా కొనసాగుతోందని, దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోందని అన్నారు. ఇరాన్ ఆర్థిక స్థితి నిరంతరం బలహీనపడుతోంది, వారి నేవీ, సైనిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు























