Iran Latest News: ఇరాన్లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు, వందల మంది మృతి! ఇంటర్నెట్ నిషేధం, విమానాలు రద్దు!
Iran Latest News: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల మధ్య ఇంటర్నెట్, ఫోన్ కాల్స్పై నిషేధం విధించారు. హింసకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది.

Iran Latest News: ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు చేయిజారిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దేశమంతా భగ్గుమంటోంది. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనీసం టెలిఫోన్ కాల్స్ చేసుకుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాల్స్పై కూడ నిషేధం విధించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, గత నెలలో ప్రారంభమైన ఈ ప్రదర్శనల్లో ఇప్పటివరకు కనీసం వందల మంది మరణించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలపై శుక్రవారం ప్రభుత్వ మీడియా కీలక ప్రకటన చేసింది. హింసను ప్రేరేపించినందుకు అమెరికా , ఇజ్రాయెల్ ఉగ్రవాద ఏజెంట్లుగా ఆరోపించింది.
ఖమేనీ ట్రంప్పై విమర్శలు
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన ఓ అహంకారి అని అభివర్ణించారు. ఆయన చేతులు ఇరానియన్ల రక్తం మరకలతో నిండి ఉన్నాయని ఆరోపించారు. ఇరాన్లో డిసెంబర్ 28, 2025న టెహ్రాన్లోని రెండు మార్కెట్లలో ప్రారంభమైన ఈ ప్రదర్శనలు దేశమంతా వ్యాపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, రియాల్ పడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి, ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసంతృప్తి నానాటికి పెరుగుతోంది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా మరణాల సంఖ్యపై మౌనం వహించింది, కాని శుక్రవారం మౌనాన్ని వీడినప్పటికీ మరణాలపై ఎలాంటి ప్రకటనల చేయలేదు. కానీ వందల సంఖ్య ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. గత నెలలో ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు
అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త వార్తా సంస్థ (HRANA) ప్రకారం, ఇరాన్లో దేశవ్యాప్త ప్రదర్శనల్లో 65 మందికిపైగా మరణించారు. ఈ ప్రదర్శనలు జనవరి 9న 13వ రోజుకు చేరుకున్నాయి. నివేదిక ప్రకారం, ఈ ప్రదర్శనలు ఇరాన్ 31 రాష్ట్రాల్లోని 180 నగరాల్లోని 512 ప్రదేశాలకు విస్తరించాయి. ఇంటర్నెట్ను మూసివేయాలనే నిర్ణయం దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమర్థులైన భద్రతా అధికారులు తీసుకున్నారని దేశ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫ్లైట్ రద్దు
దుబాయ్ విమానాశ్రయం వెబ్సైట్ ప్రకారం దుబాయ్-ఇరాన్ మధ్య కనీసం 17 విమానాలు రద్దు అయ్యాయి. ఇరాన్లో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా, టర్కిష్ ఎయిర్లైన్స్ కూడా ఇరాన్ మీదుగా వెళ్లే అనేక విమానాలను రద్దు చేసింది.
'పోలీస్ స్టేషన్ వెలుపల మెషిన్ గన్ కాల్పులు'
టెహ్రాన్లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వైద్యుడు పరిస్థితిపై మాట్లాడుతూ, రాజధానిలోని ఆరు ఆసుపత్రులలో కనీసం 217 మంది నిరసనకారులు మరణించారని, వారిలో ఎక్కువ మంది కాల్పుల వల్లే మరణించారని టైమ్ మ్యాగజైన్తో అన్నారు. నిరసనలు తీవ్రమవుతుండటంతో, భద్రతా దళాలు అనేక ప్రాంతాల్లో నిరసనకారులపై నేరుగా కాల్పులు జరిపాయని ఇరాన్ వైద్యుడు టైమ్ మ్యాగజైన్కు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రుల నుంచి మృతదేహాలను తరలించారు. ఉత్తర టెహ్రాన్లోని ఒక పోలీస్ స్టేషన్ వెలుపల మెషిన్ గన్ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు మరణించారు, కనీసం 30 మంది గాయపడ్డారు. ఇరాన్లోని నిరసనకారులు టెహ్రాన్లోని అల్-రసూల్ మసీదుకు కూడా నిప్పంటించారు.
నిరసనకారులకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని టెహ్రాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్చరించారు . ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రదర్శనలకు దూరంగా ఉంచాలని కోరారు. ఇంతలో, నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనను హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు





















