TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
TMC MPs joining BJP: తృణమూల్ కాంగ్రెస్లో భారీ చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 మంది లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Mamata Banerjee vs BJP: బెంగాల్ శాసనసభ ఎన్నికలు 2026లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీ పునాదులను కదిలిస్తోంది. సుమారు 15 ఏళ్ల అధికారానికి తెరపడుతూ బీజేపీ ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు టీఎంసీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో లోక్సభలో ఆ పార్టీకి ఉన్న బలం కూడా సడలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 12 మంది లోక్సభ ఎంపీలు ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్లినట్లు బెంగాల్లో రాజకీయవర్గాలు అంచనాకు వచ్చాయి.
టీఎంసీకి చెందిన 29 మంది లోక్సభ సభ్యుల్లో దాదాపు 12 మంది ఎంపీలు ఇప్పటికే కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో ఐదారుగురు ఎంపీలతో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద 19 నుంచి 20 మంది ఎంపీలను ఒకే తాటిపైకి తెచ్చి, ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేలా ఒక పక్కా వ్యూహం అమలవుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.మూడింట రెండు వంతుల మంది పార్టీ మారిపోతే దాన్ని విలీనం కేటగిరీలో చేర్చడం ద్వారా అనర్హతా వేటును తప్పించుకోవచ్చు. 20 మంది ఎంపీలు పార్టీ మారితే సరిపోతుంది.
ఈ పరిణామం మమతా బెనర్జీకి , అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించనుంది. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించే కొందరు నేతలు కూడా ఈ జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నాయకత్వంపై అసంతృప్తి పెరగడం, భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న నేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు భావిస్తున్నారు.
మరోవైపు, పార్టీని కాపాడుకోవడానికి టీఎంసీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ చెల్లాచెదురవ్వడం , సీనియర్ నేతల అసమ్మతి ఆ పార్టీని మరింత బలహీనపరుస్తోంది. ఒకవేళ ఈ ఎంపీల వలసలు నిజమైతే, జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ప్రాభవం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, పార్లమెంటులో కూడా ఆ పార్టీ బలం నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
రాజ్యసభ ఎంపీలూ ఫిరాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13 మంది సభ్యులు ఉన్నారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక, లోక్సభ ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం, సుమారు 8 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. లోక్సభలో ఇప్పటికే మెజారిటీ ఎంపీలు చేజారిపోయే స్థితిలో ఉండటంతో, రాజ్యసభలో కూడా ఇదే విధమైన తిరుగుబాటు జరిగితే పార్లమెంటులో టీఎంసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో ఈ వలసలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ అనిశ్చితి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు అగ్నిపరీక్షగా మారింది.
ట్రెండింగ్ వార్తలు




















