SC on Centre: బీబీసీ డాక్యుమెంటరీ పిటిషన్పై సుప్రీం విచారణ, సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు పంపింది.
SC on BBC Documentary:
గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏప్రిల్కు విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్తో కూడా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అడ్వకేట్ ఎమ్ ఎల్ శర్మతో పాటు సీనియరన్ జర్నలిస్ట్ ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, అడ్వకేట్ ప్రశాంత భూషణ్...సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఎన్నో నిజాలున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పిటిషన్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కడా ఈ వీడియోలు లేకుండా చేయడాన్నీ సవాలు చేశారు.
BBC documentary row: SC issues notice to Centre, seeks report within 3 weeks
— ANI Digital (@ani_digital) February 3, 2023
Read @ANI Story | https://t.co/YxteEzRYmw#BBCdocumentary #SCNotice #SupremeCourt #CentralGovernment pic.twitter.com/EAvnOrrgT7
ఇదే సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా పిటిషనర్లను పలు ప్రశ్నలు వేశారు. ఈ అంశంపై హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు..? అని అడిగారు. పిటిషనర్లలో ఒకరైన సీయూ సింగ్ వీలైనంత త్వరగా విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఈ బీబీసీ డాక్యుమెంటరీ చూసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారన్న అంశాన్ని ప్రస్తావించారు సీయూ సింగ్. అయితే...దీనిపై స్పందించిన ధర్మాసనం "ఇది వేరే అంశం. ఇప్పటికీ కొందరు ఈ డాక్యుమెంటరీని చూస్తున్నారు" అని సమాధానమిచ్చింది. జనవరి 21న కేంద్రం " India: The Modi Question"పేరిట ఉన్న యూట్యూబ్ వీడియోలు, ట్విటర్ వీడియోలను బ్లాక్ చేయాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ట్విటర్తో పాటు మరి ఏ సామాజిక మాధ్యమాల్లోనూ ఆ వీడియోలు లేకుండా నిషేధం విధించింది.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి సిట్ ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్ను సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఈ పిటిషన్ వేశారు. అల్లర్ల సమయంలో అహ్మదాబాద్లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఆ తరవాత గతేడాది జూన్లో తీర్పును వెలువరించింది. సిట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలనే సుప్రీం సమర్థించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets