PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
PM Modi: కాంగ్రెస్ కూటమి పార్టీలు మహిళల కలలను భగ్నం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

Modi warns opposition parties : మహిళా రిజర్వేషన్ల బిల్లును ఓడించినందుకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ శిక్ష అనుభవించాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి, ముఖ్యంగా ఈ దేశ మహిళల కోసం చర్చించడానికి ఇక్కడ ఉన్నాను. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మహిళల పురోగతి ఎలా నిలిచిపోయిందో చూస్తున్నారు... మా శతవిధ ప్రయత్నాల పట్టికీ, మేము విజయం సాధించలేకపోయామని ఆయన తెలిపారు. నారీ శక్తి అధినియంలో సవరణలు చేయలేకపోయాము. దీనికి గాను దేశంలోని తల్లులందరికీ, సోదరీమణులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నానని మోదీతెలిపారు. దేశ సంక్షేమమే మాకు మొదటి ప్రాధాన్యత. కానీ, కొంతమందికి దేశ సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు, దాని భారాన్ని ఈ దేశ మహిళలే మోయాల్సి వస్తుంది. ఈసారి కూడా అదే జరిగిందని అన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ , సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాల భారాన్ని ఈ దేశ నారీ శక్తి భరించాల్సి వచ్చిందన్నారు.
వ్యక్తిగతంగా, కాంగ్రెస్ తన దశాబ్దాల కాలం నాటి తప్పును సరిదిద్దుకుంటుందని, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని నేను ఆశించానని మోదీ అన్నారు. కానీ చరిత్రను లిఖించే అవకాశాన్ని, మహిళలకు అండగా నిలిచే అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది. ఒక పరాన్నజీవిలా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ తనను తాను బ్రతికించుకుంటోంది. అయితే కాంగ్రెస్ ఆ ప్రాంతీయ పార్టీలు బలపడటం కూడా ఇష్టపడదు. అందుకే, ఈ సవరణను ఆ ప్రాంతీయ పార్టీల చేత వ్యతిరేకింపజేసి, వారి భవిష్యత్తును చీకట్లోకి నెట్టేలా ఒక రాజకీయ కుట్ర పన్నిందని విమర్శించారు.
పార్లమెంటులో నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించిన పార్టీలకు నేను స్పష్టంగా చెబుతున్నాను.. మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు. ఇరవై ఒకటవ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నిశితంగా గమనిస్తున్నారనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు. మహిళలు వీరి ఉద్దేశాలను అర్థం చేసుకుంటున్నారు, నిజమేంటో వారికి పూర్తి అవగాహన ఉంది. అందుకే, మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు చేసిన ఈ పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.
#WATCH | In his address to the nation, Prime Minister Narendra Modi says, "I will say clearly to those parties who opposed the Nari Shakti Vandan Amendment in Parliament yesterday: These people are taking women's power for granted. They are forgetting that women of the… pic.twitter.com/0WE1i4MbDx
— ANI (@ANI) April 18, 2026
కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ సహా ఇతర పార్టీలు ఇన్నేళ్లుగా ఒకే విధమైన సాకులు చెబుతూ వస్తున్నాయి. ఏవో కొన్ని సాంకేతిక అంశాలను సాకుగా చూపి, మహిళల హక్కులను కాలరాశాయి. ఈ వికృత రాజకీయ పోకడలను, వీటి వెనుక ఉన్న అసలు కారణాలను దేశం ఇప్పటికే అర్థం చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. నారీ శక్తి వందన్ అధినియాన్ని వ్యతిరేకించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది - అదే ఈ వారసత్వ పార్టీల భయం. మహిళలు గనుక సాధికారత సాధిస్తే, తమ వారసత్వ రాజకీయాల నాయకత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఈ పార్టీలు వణికిపోతున్నాయి. తమ కుటుంబాలకు చెందని మహిళలు రాజకీయాల్లో ఎదిగి, ముందుకు రావడాన్ని ఇవి ఎన్నటికీ సహించలేవన్నారు.
ఈ పార్టీలు రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను కూడా అవమానించాయి, ఈ పాపానికి గాను ప్రజలు ఇచ్చే శిక్ష నుండి వీరు తప్పించుకోలేరని మోదీ అన్నారు. నారీ శక్తి వందన్ సవరణ అనేది ఎవరి దగ్గరో ఏదో లాక్కోవడం కోసం తెచ్చింది కాదు, అందరికీ ఏదో ఒకటి ఇవ్వడం కోసం ఉద్దేశించింది. గత 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హక్కులను మహిళలకు కల్పిస్తూ, 2029 ఎన్నికల నాటికి వారిని సాధికారత వైపు నడిపించడమే దీని లక్ష్యం. వారి ప్రగతి పథంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చేపట్టిన ఒక 'మహాయజ్ఞం' ఇది. ప్రస్తుత తరుణంలో నారీ శక్తి వందన్ సవరణ దేశానికి ఎంతో అవసరమని గుర్తుచేశారు. కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు పార్లమెంటులో అందరి కళ్ల ముందే ఈ బృహత్తర ప్రయత్నాన్ని భ్రూణహత్య చేశాయి. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలే దీనికి బాధ్యులు. ఈ దేశ నారీ శక్తి పట్ల అపరాధులుగా వీరు మిగిలిపోతారని మోదీ స్పష్టం చేశారు.
#WATCH | In his address to the nation, Prime Minister Narendra Modi says, "These parties also insulted the sentiments of the framers of the Constitution, and they will not be spared by the people's punishment for this. The Nari Shakti Vandan Amendment was not about taking… pic.twitter.com/EyAwPg7Y7Y
— ANI (@ANI) April 18, 2026
మహిళా రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది, దీనిని అడ్డుకునేందుకు ఎల్లప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంది. గతంలో ఎప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా, కాంగ్రెస్ ఏదో ఒక రూపంలో అడ్డంకులు సృష్టించింది. ఈసారి కూడా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రక్రియను ఆపేందుకు యత్నించాయి. తద్వారా వారు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మోదీ విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు నిరంతరం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మోదీవిమర్శించారు. ఈ సాకుతో దేశంలో విభజన సెగలు రాజేయాలని అవి ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ వారి నుంచి వారసత్వంగా పొందిన విభజించి పాలించు రాజకీయాన్నే కాంగ్రెస్ నేటికీ అనుసరిస్తోందని మోదీ మండిపడ్డారు. దేశంలో చీలికలు తెచ్చే భావోద్వేగాలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ నైజం. పునర్విభజన వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. అయితే, ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గదని, రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో మార్పు ఉండదని ప్రభుత్వం మొదటి రోజు నుంచే స్పష్టం చేస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాల సీట్లను సమాన నిష్పత్తిలో పెంచడం జరుగుతుంది. అయినప్పటికీ, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవని విమర్శించారు.
#WATCH | PM Narendra Modi says, "Congress and its allies are continuously lying over delimitation. They want to fan the flames of division under this pretext. Congress has learned the politics of divide and rule from the British as its heritage. Even today, Congress is… pic.twitter.com/s2NXZeBujk
— ANI (@ANI) April 18, 2026
ఈ సవరణ బిల్లు అన్ని రాజకీయ పార్టీలకు , రాష్ట్రాలకు ఒక గొప్ప అవకాశమని మోదీ గుర్తు చేశారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళతో పాటు ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్య పెరిగేది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ పార్టీలు సొంత రాష్ట్ర ప్రజలకే ద్రోహం చేశాయి. తమిళనాడు నుంచి మరింత మంది తమిళులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పంపే అవకాశం డీఎంకేకు ఉండేది, తద్వారా తమిళనాడు గొంతుక మరింత బలోపేతం అయ్యేది. కానీ ఆ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. అదేవిధంగా బెంగాల్ ప్రజలను ముందుకు నడిపించే అవకాశం టీఎంసీకి లభించినా, ఆ పార్టీ దానిని వినియోగించుకోలేకపోయింది. అటు సమాజ్ వాదీ పార్టీ తనకున్న మహిళా వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే అవకాశం వచ్చినప్పటికీ, దానిని వదులుకుంది. ఎస్పీ ఇప్పటికే లోహియా ఆశయాలను మరిచిపోయింది. నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించడం ద్వారా లోహియా గారి కలలను ఎస్పీ చిదిమేసింది. ఎస్పీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ఉత్తరప్రదేశ్ . దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోరని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తాము సంస్కరణలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకుంది. 21వ శతాబ్దపు 'వికసిత భారత్' నిర్మాణానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సంస్కరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. దేశం తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ఆ పార్టీ తిరస్కరించడమే కాకుండా, వాటికి అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్ చరిత్ర అంతా ఇటువంటి ప్రతికూల రాజకీయాలతోనే నిండి ఉందని గుర్తు చేశారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దేశంలోకి చొరబడిన అక్రమ చొరబాటుదారులను ఏరివేయడాన్ని అడ్డుకుంటోంది. ఎస్ఐఆర్ , వక్ఫ్ బోర్డు సంస్కరణలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. చివరికి సీఏఏ విషయంలోనూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి అడ్డుపడింది.తప్పుడు సమాచారంతో దేశవ్యాప్తంగా అశాంతి సృష్టించింది. మావోయిస్టు, నక్సల్స్ హింసను రూపుమాపేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఆ పార్టీ ఆటంకం కలిగిస్తోంది. దేశంలో ఏ సంస్కరణ తెచ్చినా, దానిపై అబద్ధాలు చెప్పడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ నైజంగా మారింది. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఇలాంటి ప్రతికూల మార్గాన్నే ఎంచుకుంటుందని చరిత్రే సాక్షి అని మోదీ గుర్తుచేశారు.
#WATCH | PM Narendra Modi says, "Congress opposes One Nation One Election, it opposes driving out infiltrators from the country, it opposes SIR, it Waqf Board reforms. Congress even opposed CAA and lied about it. It kicked up a storm in the country by spreading misinformation. It… pic.twitter.com/4sA9CBVom3
— ANI (@ANI) April 18, 2026
మనతో పాటే అనేక దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. వాటిలో చాలా దేశాలు మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అన్ని సంస్కరణలను అడ్డుకోవడమే. పనులను వేలాడదీయడం , దారి మళ్లించడం , అడ్డుకోవడం అనేవి కాంగ్రెస్కు అలవాటైన పని సంస్కృతి. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను, పాకిస్థాన్తో నీటి వివాదాలను ఆ పార్టీ దశాబ్దాల తరబడి పెండింగ్లో పెట్టింది. ఓబీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని, వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకాన్ని 40 ఏళ్ల పాటు తొక్కిపెట్టిందని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న ఇటువంటి వైఖరి దేశానికి ఎంతో నష్టం చేకూర్చింది. ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యతిరేకత, అస్థిరత, వంచన వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది. నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లన్నీ కాంగ్రెస్ ప్రవర్తన వల్ల పుట్టినవే. అందుకే, ఈ పోరాటం కేవలం ఒక చట్టం గురించి మాత్రమే కాదు; సంస్కరణలకు వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ మనస్తత్వంపై సాగుతున్న పోరు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ ధోరణికి దేశంలోని మహిళలు ఖచ్చితంగా తగిన సమాధానం చెబుతారనే విషయంలో సందేహం లేదన్నారు.
ట్రెండింగ్ వార్తలు





















