Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
Bank account: కేంద్రం ప్రజల ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు జమ చేస్తోందని.. బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ ఇవ్వాలని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. కానీ అదంతాపెద్ద మోసం.

Is Centre depositing Rs 46715 into every citizen bank account: సోషల్ మీడియా , వాట్సాప్ గ్రూపుల్లో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 46,715 జమ చేస్తోంది అనే వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా ఒక సైబర్ మోసం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్రం డబ్బులు జమ చేస్తోందని బ్యాంక్ అకౌంట్ల సమాచారం చోరీ
దేశంలోని ప్రతి పౌరుడికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం రూ. 46,715 సాయం అందిస్తోందని, దీని కోసం ఒక లింక్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి ఏ పథకాన్ని ప్రకటించలేదని, ఈ వైరల్ సందేశం పూర్తిగా నకిలీదని పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. ప్రజలను తప్పుదోవ పట్టించి వారి వ్యక్తిగత , బ్యాంకింగ్ వివరాలను దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగం ఇది అని అధికారులు హెచ్చరించారు.
ఇలాంటి లింకుల్లో క్లిక్ చేస్తే నష్టపోవాల్సిందే
ఈ స్కామ్లో భాగంగా బాధితులకు ఒక వాట్సాప్ సందేశం లేదా ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అంటూ ఒక ఆకర్షణీయమైన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే అది ప్రభుత్వ వెబ్సైట్ను పోలిన ఒక నకిలీ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP) అడుగుతారు. ఈ వివరాలను నమోదు చేయగానే, సహాయం అందడం పక్కన పెడితే, మీ ఖాతాలోని సొమ్మును సైబర్ నేరగాళ్లు మాయం చేస్తారు.
అలాంటి పథకాలేమీ లేవన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇటువంటి నగదు బదిలీ పథకాల కోసం వాట్సాప్ ద్వారా లింక్లు పంపదని పీఐబీ స్పష్టం చేసింది. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవాలంటే కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు, మీ వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు అని ఆర్థిక శాఖ పౌరులను కోరింది.
గతంలో కూడా పీఎం యోజన పేరుతో రూ. 15 లక్షలు లేదా నిరుద్యోగ భృతి వంటి నకిలీ వార్తలు వచ్చాయని, జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సందేశాలు పొందితే వాటిని ఇతర గ్రూపులకు షేర్ చేయకుండా, వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమం.



















