Iran War Updates: పశ్చిమాసియాలో శాంతి సూచనలు - ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన వెనుక అసలు వ్యూహం ఏమిటి?
Iran proposes to stop war: ఇరాన్ యుద్ధం ముగించాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ఓ ప్రతిపాదనను అమెరికా, ఇజ్రాయెల్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Iran proposes to stop war: యుద్ధం కారణంగా నిప్పుల కొలిమిలా మారిన పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం కొన్ని కీలక షరతులతో కూడిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ , అమెరికా మిత్రపక్షాల నుండి ఎదురవుతున్న తీవ్రమైన వైమానిక దాడులతో, ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుని చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం, ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఉంటేనే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకటి.. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు నిలిపివేయడం, రెండు - గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక ఆంక్షలను సడలించడం, మూడు- లెబనాన్, గాజాలో తక్షణ శాంతిని నెలకొల్పడం. ఈ షరతులను అమెరికా , ఇజ్రాయెల్ అంగీకరిస్తేనే ఇరాన్ తన క్షిపణి దాడులను పూర్తిగా నిలిపివేస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలకు కీలక సందేశం పంపారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ప్రాంతీయ శాంతి కోసం సహకరించాలని ఆయన కోరారు. ఇది కేవలం ఇజ్రాయెల్తో యుద్ధం ఆపడమే కాకుండా, అరబ్ దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తన ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి , అంతర్జాతీయంగా ఒంటరి కాకుండా ఉండేందుకు ఈ శాంతి మంత్రం జపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, అమెరికా , ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదనలను ఎంతవరకు నమ్ముతాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత యంత్రాంగం కూడా ఇరాన్ మాటలను కాలయాపన తంత్రం గా భావిస్తున్నారు. ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హిజ్బుల్లా, హౌతీలు పూర్తిగా నియంత్రించకుండా కేవలం మాటలతో శాంతి సాధ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. దీంతో, ఇరాన్ ప్రతిపాదనపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
ఒకవేళ ఈ కాల్పుల విరమణ గనుక అమల్లోకి వస్తే, అది అతిపెద్ద విజయం అవుతుంది. చమురు సరఫరా పునరుద్ధరణతో పాటు, గల్ఫ్లో చిక్కుకున్న వారి భద్రతకు గ్యారెంటీ లభిస్తుంది. ముఖ్యంగా సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతినే ముప్పు తప్పడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ, అంతర్జాతీయ వాణిజ్యం యధావిధిగా కొనసాగుతాయి. రాబోయే 48 గంటల్లో ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగే చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
























