Narendra Modi Longest Serving Elected Prime Minister: చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
Modi Historic Milestone: ప్రధాని మోదీ జూన్ 9, 2026న కొత్త చరిత్ర సృష్టించనున్నారు. దేశంలోనే అత్యధిక కాలం నేరుగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించబోతున్నారు మోదీ .

PM Modi Breaks Jawaharlal Nehru Record 12 Years 14 days: భారత రాజకీయాల్లో జూన్ 9, 2026 ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోనుంది. ఆ రోజుతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలు అందించిన నేరుగా ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 12 ఏళ్ల 14 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించనున్నారు. సాంకేతికంగా నెహ్రూ మొత్తం ప్రధానిగా ఉన్న కాలం ఎక్కువైనప్పటికీ.. ఆయన మొదటిసారి 1947లో మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా సెలెక్ట్ అయ్యారు తప్ప నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక కాలేదు. కానీ, 2014 మే 26న మొదటిసారి నేరుగా ప్రజా బ్యాలెట్ ద్వారా ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహించిన నరేంద్ర మోదీ, నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ప్రజామోదంతోనే ఈ రికార్డును సొంతం చేసుకుంటున్నారు.
ఎంపికకు.. ఎన్నికకు మధ్య వ్యత్యాసం ఇదే
భారతదేశ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అంతకంటే ముందు 1947 ఆగస్టు 15 నుండి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. అది రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఆ రకంగా చూస్తే నెహ్రూ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రధానిగా కొనసాగిన నికర కాలం 12 ఏళ్ల 14 రోజులు మాత్రమే. నరేంద్ర మోదీ 2014 మే లో తొలిసారి, ఆ తర్వాత వరుస విజయాలతో నేరుగా ప్రజామోదం పొందుతూ ఈ రికార్డును బద్దలు కొడుతున్నారు. మోదీ సాధించిన ఈ ఘనతకు ఆయన నేతృత్వంలోని లీడర్షిప్, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న తిరుగులేని ప్రజాదరణే ప్రధాన కారణం.

రాజకీయ సుస్థిరత - సంస్కరణల యుగం
నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం దశాబ్దాల నాటి సంకీర్ణ రాజకీయాల అస్థిరత నుంచి బయటపడి పటిష్టమైన రాజకీయ సుస్థిరత వైపు అడుగులు వేసింది. ఈ సుస్థిరత వల్లే జీఎస్టీ లాంటి క్లిష్టమైన పన్ను సంస్కరణలు, డిజిటల్ ఇండియా విప్లవం, బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన వంటి సంచలన నిర్ణయాలు సాధ్యమయ్యాయి. జాతీయ భద్రత విషయంలో రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తూ ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ అంతర్గత రాజకీయ స్వరూపాన్ని మోదీ మార్చివేశారు.
సంక్షేమ పథకాలు - అట్టడుగు వర్గాలకు భరోసా
మోదీని సుదీర్ఘకాలం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన అసలైన బలం ఆయన ప్రవేశపెట్టిన అంత్యోదయ పథకాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు, ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, జన్ ధన్ ఖాతాల ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే నగదు బదిలీ వంటివి క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అవినీతికి తావులేకుండా సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ సాయాన్ని నేరుగా పేదవాడి గడపకు చేర్చడం ద్వారా మోదీ మహిళలు, గ్రామీణ ఓటర్లలో ఒక బలమైన ‘ప్రో-పూర్ ఇమేజ్ను సంపాదించుకున్నారు.
ప్రపంచానికి భారత్ విశ్వగురు
గడిచిన పన్నెండేళ్లలో అంతర్జాతీయ దౌత్యరంగంలో భారత స్థానం అగ్రరాజ్యాల సరసనకు చేరింది. మోదీ నాయకత్వంలో భారత్ జి-20 సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి గ్లోబల్ సౌత్ వాయిస్గా అవతరించింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల సమయంలోనూ భారత్ అనుసరించిన తటస్థ, వ్యూహాత్మక దౌత్యనీతి ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, త్వరలోనే మూడో స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఆత్మనిర్భర్ భారత్ - మౌలిక సదుపాయాల విప్లవం
దేశీయ రక్షణ, ఉత్పాదక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చారు. ఫలితంగా నేడు భారత్ మొబైల్ తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. రక్షణ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, విమానాశ్రయాల ఆధునీకరణ ద్వారా దేశ మౌలిక సదుపాయాల రంగాన్ని ఊహించని వేగంతో పరుగులు పెట్టించారు.
నరేంద్ర మోదీ సృష్టించబోయే ఈ చారిత్రాత్మక రికార్డు కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి కాదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థిరత్వానికి, ప్రజలు ఒక బలమైన నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. నెహ్రూ రికార్డును దాటుకుని ముందుకు సాగుతున్న మోదీ నవభారత నిర్మాణంలో తన ముద్రను మరింత బలంగా వేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















