ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
400ఏళ్ల ముందు ఢిల్లీపై 1398లో తుగ్లక్ల పాలనలో సమర్ఖండ్ పాలకుడు తైమూర్ కూడా ఇలాంటి దాడి చేశాడు గానీ ఢిల్లీ వెంటనే కోలుకుంది. కానీ నాదిర్ షా దాడి నుంచి మాత్రం కోలుకోలేదు.

దాదాపు రెండు వేల ఏళ్లకిపైగా భారత చరిత్రలో ఢిల్లీది ప్రత్యేక స్థానం. 800CE నుంచి ఇది తోమార్ రాజవంశ రాజధానిగా చరిత్రకెక్కింది. 12వ శతాబ్దంలో ఘోరీ అహ్మద్ దాడుల దగ్గర నుంచి ఎక్కువగా ఇది ముస్లిం పాలకుల చేతుల్లోనే ఉంటూ వచ్చింది. అయితే దాడులకు రావడం దోచుకుపోవడం లేదా ఇక్కడే రాజ్యం ఏర్పాటు చేసుకుని పాలన చెయ్యడం ఇలానే వాళ్లందరి ప్రస్థానం సాగింది. కానీ ఢిల్లీ ఎన్నడూ చూడని ఘోరకలి చూసింది మాత్రం 22 మార్చ్ 1739న. నాటి పర్షియా (ఇరాన్ )పాలకుడు నాదిర్ షా ఢిల్లీలో జరిపిన సామాన్య ప్రజల ఊచకోత జరిగింది ఆ రోజే.
మొఘల్ పాలనఫై ఆఖరి చావు దెబ్బ -నాదిర్ షా దండ యాత్ర
చక్రవర్తి ఔరంగ్ జేబు మరణం (1707) తర్వాత అంతఃకలహాలతో మొగల్ రాజకుటుంబం బాగా దెబ్బతింది. చివరికి మహమ్మద్ షా సుల్తాన్ (1719-1748)కావడంతో పరిస్థితులు చక్కబడుతున్న సమయం అది. అప్పటికి మొఘల్ సామ్రాజ్యం ఇంకా సిరిసంపదలతో తులతూగుతూనే ఉంది. సరిగ్గా అదే సమయంలో ఇరాన్ పాలకుడిగా పగ్గాలు చేపట్టిన నాదిర్ షా దృష్టి ఢిల్లీపై పడింది. అప్పటికతను పక్క రాజ్యాలతో చేసిన యుద్ధాల వల్ల దివాళ తీసి ఉన్నాడు. డబ్బు, బంగారం కోసం అతను ఇండియాపై దండెత్తాడు. పొలిటికల్గా మొగల్ సామ్రాజ్యం చాలా బలహీనంగా ఉన్న సమయం అది.
మహమ్మద్షాకు ఇతర రాజ్యాల నుంచి సరైన సహాయం రాలేదు. దానితో ఢిల్లీని ఓడించి ఎర్రకోటలో తిష్ట వేశాడు నా దిర్ షా. ఒక రోజు అతని సైనికులకు ఢిల్లీలోని పహార్ గంజ్ మార్కెట్లోని వ్యాపారులకు మధ్య ధరల గురించి చిన్న గొడవ మొదలైంది. అది కొట్లాటకు దారి తీయడంతో కొందరు నాదిర్ షా సైనికులు చనిపోయారు. అదే సమయంలో ఎర్రకోటలో నాదిర్ షా చనిపోయాడనే పుకారు పుట్టింది. దానితో రెచ్చిపోయిన ఢిల్లీ సైనికులు, వ్యాపారులు నాదిర్ షా సైన్యంపై తిరగబడి 21 మార్చ్ 1739 రాత్రి 3000మందిని హత మార్చారు. ఇది తెలిసి నాదిర్ షా ఆగ్రహం తో 'ఖతిల్ -ఈ -ఆమ్ ' (సామాన్య జనాన్ని చంపడం )కి పిలుపు ఇచ్చాడు.
ఢిల్లీ చరిత్రలో ఎన్నడూ చూడని మారణ హోమం
22 మార్చ్ 1739 ఉదయం నాదిర్ షా ఎర్రకోట ఎదురుగా ఉన్న చాందిని చౌక్కి పెద్ద సైన్యం తో చేరుకున్నాడు. అక్కడ ఉన్న సునేరి మస్జీద్పైన కూర్చుని డ్రమ్ములు, బూరలు మోగించమని చెప్పి తన చేతిలోని రాజ ఖడ్గాన్ని పైకి ఎత్తాడు. నిజానికి ఇది తన సైన్యానికి ఇచ్చిన సిగ్నల్. అది అందుకున్న అతని సైనికులు సామాన్య జనంపై ఊచకోత మొదలు పెట్టారు. హిందూ, ముస్లిం, శిఖ్, ఆడ, మగ, చిన్న పిల్లలు అని తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆయుధాలు, రక్షణ లేని సామాన్యులను చంపుతూనే ఉన్నారు.
ఢిల్లీలోని చాందిని చౌక్,దరిబా కాలన్, ఫాతేపురి,ఫైజ్ బజార్,హాజ్ ఖాజి,జోరి బజార్లతోపాటు ఎర్రకోటకు మూడు వైపులా ఉండే లాహోరి, అజ్మీరి కాబూలి గేట్ మార్గాలన్నీ శవాలతో నిండి పోయాయి. జరుగుతున్న మారణకాండ చూసి మొహమ్మద్ షా ఇతర మొఘల్ ముఖ్యులు అక్కడికి చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాదిర్ షాను ఆ ఘోరకలి ఆపమని వేడుకుంటూనే ఉన్నారు. చివరికి ఢిల్లీ రోడ్లపై ప్రజల రక్తం ప్రవహిస్తున్న సమయంలో చీకటి పడుతుండగా నాదిర్ షా మళ్లీ తన కత్తిని పైకెత్తి హత్యా కాండను ఆపమని సిగ్నల్ ఇచ్చాడు.
అప్పటికప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున గొయ్యిలు తీసి అందులో శవాలను వేసి కప్పెట్టేయడం, పెద్ద ఎత్తున శవాలను ఒకే చితిపై దహనం చేయడం వంటి కార్యక్రమాలతో ఎంతో సుందరమైన ఢిల్లీ నగరం 'దెయ్యాల నగరం " గా మారిపోయింది అని నాటి సమకాలిన చరిత్ర కారులు రస్తుం అలీ,
అబ్దుల్ కరీమ్ తమ గ్రంథాలు
Tarikh-e-Hindi, the Bayan-e-Waqaiల్లో వివరంగా నమోదు చేశారు. ఆ ఒక్క రోజు చనిపోయిన వారి సంఖ్య 30,000 అని రాశారు కానీ నిజానికి పిల్లలు, స్త్రీలు అందరూ కలిసి ఈ సంఖ్య దానికి రెట్టింపు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. చచ్చిన వారి డబ్బు మీదే అంటూ నాదిర్ షా అనుమతి ఇవ్వడంతో అతని సైనికులు ఈ హత్యకాండకు పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. చనిపోయిన వారు కాకుండా మరో 10వేల మంది ఢిల్లీ స్త్రీలు, పిల్లలను బానిసలుగా పట్టుకున్నారు.
ఢిల్లీ నుంచి నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం కోల్పోయింది అప్పుడే
ఆ మారణకాండ తరువాత 16 మే 1739 వరకూ ఢిల్లీలోనే ఉన్న నాదిర్ షా ఖజానా మొత్తం దోచుకు పోయాడు. అప్పుడే షాజహాన్ ఎంతో ముచ్చటపడి చేయించిన "నెమలి సింహాసనాన్ని" శాశ్వతంగా కోల్పోయింది ఇండియా. "కోహినూర్ "ని కూడా నాదిర్ షా తీసుకు పోయినా అనేక చేతులు మారి కొన్నాళ్ళు మళ్ళీ రంజిత్ సింగ్ చేతికి వచ్చి ఆపై బ్రిటన్ చేరుకుంది. వీటితోపాటు మరో గొప్ప వజ్రం 'దరియా నూర్'ని కూడా పట్టుకుని పోయాడు నాదిర్ షా. అది ఇప్పటికీ ఇరాన్ లోనే ఉంది.
మళ్ళీ కోలుకోని ఢిల్లీ
అంతకు 400ఏళ్ల ముందు ఢిల్లీపై 1398లో తుగ్లక్ల పాలనలో సమర్ఖండ్ పాలకుడు తైమూర్ కూడా ఇలాంటి దాడి చేశాడు గానీ ఢిల్లీ వెంటనే కోలుకుంది. కానీ నాదిర్ షా దాడి నుంచి మాత్రం కోలుకోలేదు. అప్పటికే యూరోపియన్లు వర్తకం పేరుతో ఇండియాలోకి అడుగు పెడుతున్నారు. మరోవైపు మహారాష్ట్రులు, సిక్కు రాజ్యాలు బలంగా ఉన్నాయి. దానితో మొఘల్ సామ్రాజ్యం మళ్ళీ గత వైభవాన్ని అందుకోలేకపోయింది. అప్పుడు మొదలైన పతనం 1857 నాటికి చివరకు చేరుకొంది.
బానిసలను విడిపించిన సిక్కులు
నాదిర్ షా సైన్యాన్ని తిరుగు ప్రయాణంలో సిక్కులు ఎదిరించారు. ఢిల్లీ నుంచి పట్టుకుపోతున్న ధనంలో కొంత భాగంతోపాటు, బానిసలుగా వాళ్ళ వెంట వెళుతున్న స్త్రీలు, పిల్లల వంటి వారిని విడిపించారు. మే నెలలో మండుటెండల్లో తమపై మెరుపు దాడి చేసిన సిక్కు సైన్యాలను ఆపలేక పోయారు నాదిర్ షా సైనికులు. పైగా అప్పటికే వరుస యుద్దాలతో వారు అలిసి పోయి ఉన్నారు. అయినప్పటికీ నాదిర్ షా ఎంత సంపద పట్టుకెళ్ళాడు అంటే ఇరాన్లో మూడేళ్ల పాటు ప్రజలకు టాక్స్లు రద్దు చేశాడు. కానీ ఢిల్లీపై మాత్రం అతను కొట్టిన చావు దెబ్బ చరిత్రలో అలానే ఉండిపోయింది. చివరకు జూన్ 1747లో ఇరాన్లో తన సొంత అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యాడు నాదిర్ షా.
ట్రెండింగ్ వార్తలు



















