Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
NHSRCL Hyderabad to Bengaluru High Speed Rail: బుల్లెట్ రైళ్ల పేరుతో ప్రస్తుతం హడావుడి జరుగుతోంది. అయితే ఎంత చేసినా మరో తరం వరకూ కొత్త కారిడార్లు నిర్మించడం అసాధ్యమన్న భావన వినిపిస్తోంది.

India Bullet Train Projected Timeline 2037: హైదరాబాద్ మహానగరం నుంచి దేశంలోని ఇతర ప్రధాన ఐటీ, కమర్షియల్ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. 2037 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ డీపీఆర్ పనులను వేగవంతం చేసింది. అయితే, క్షేత్రస్థాయి పరిశీలన, అంతర్జాతీయ రైల్వే ప్రాజెక్టుల నమూనాలను పరిశీలిస్తే .. బుల్లెట్ ట్రైన్ల నిర్మాణం అనుకున్నంత ఈజీ కాదని, ఇది మరో తరానికి మాత్రమే అందుబాటులోకి వచ్చే సుదీర్ఘ ప్రక్రియ అని స్పష్టమవుతోంది.
కిలోమీటరుకు రూ. 250 కోట్లు.. బడ్జెట్ భారమే అతిపెద్ద సవాల్!
హై స్పీడ్ రైల్ నెట్వర్క్ నిర్మాణానికి అయ్యే వ్యయం సామాన్యమైనది కాదు. వన్యప్రాణులు, పశువులు , మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో నిర్మించాల్సిన ఈ ట్రాక్ కోసం కేవలం ఒక కిలోమీటరుకు దాదాపు రూ. 250 కోట్ల ఖర్చవుతుందని అంచనా. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాల దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మూడు కారిడార్ల పూర్తి నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతటి భారీ మూలధనాన్ని సమకూర్చడం, నీతి ఆయోగ్ నుండి ఫైనాన్షియల్ క్లియరెన్స్ సాధించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.
భూసేకరణ.. అంతరాష్ట్ర వివాదాల పద్మవ్యూహం!
ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి రైల్వే శాఖ ఎలివేటెడ్ కారిడార్లను ఎంచుకున్నప్పటికీ, భూసేకరణ అనేది మరో అతిపెద్ద అడ్డంకి కాబోతోంది. ఈ మూడు కారిడార్లు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకే ప్రాజెక్ట్ కోసం ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలు భూసేకరణ, స్థానిక క్లియరెన్సులు, పర్యావరణ అనుమతులను ఒకే వేగంతో పూర్తి చేయడం భారతదేశ రాజకీయ, బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో చాలా కాలయాపనతో కూడుకున్న వ్యవహారం. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టులో కేవలం భూసేకరణ సమస్య వల్లే ఏళ్లు ఆలస్యమైన విషయాన్ని ఇక్కడ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
వందే భారత్కే ఫెన్సింగ్ కష్టం.. 320 కిలోమీటర్ల వేగం అంటే సాహసమే!
ప్రస్తుతం దేశంలో గంటకు 130 నుండి 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వందే భారత్ రైళ్లకే ట్రాక్లపై పశువులు రాకుండా కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేయడానికి రైల్వే శాఖ ఆయాసపడుతోంది. అలాంటిది, డబుల్ స్పీడ్తో అంటే గంటకు 320 కిమీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు మార్గంలో ఎలాంటి చిన్న అవరోధం ఏర్పడినా ఊహించని విపత్తు జరుగుతుంది. జపాన్ శింకాన్సెన్ టెక్నాలజీ తరహాలో 100 శాతం సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలంటే, స్టేషన్లతో సహా ప్రతి అంగుళం పూర్తిగా ఎలివేటెడ్గా, సెగ్రిగేటెడ్గా ఉండాలి. ఈ స్థాయి సిగ్నలింగ్, సేఫ్టీ నెట్వర్క్ స్థాపనకు దశాబ్ద కాలం పడుతుంది.
ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ నేర్పిన పాఠాలు!
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ 508 కిమీ పనులు ప్రారంభమై ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి కార్యరూపం దాల్చలేదు. సాంకేతిక నిపుణుల కొరత, జపాన్ నుంచి ఇంజనీరింగ్ బదిలీ ప్రక్రియలో ఆలస్యం వంటివి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వడోదరలోని హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పుడు భారతదేశంలో ఒక నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి తయారవుతుండటం కాస్త సానుకూలాంశం. ముంబై ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న పాఠాలు హైదరాబాద్ కారిడార్ల నిర్మాణ వ్యయాన్ని, సమయాన్ని కొంత తగ్గించవచ్చు.
మరో తరానికే అసలైన ఫలాలు.. మధ్యతరగతికి భారమేనా?
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లు పూర్తయి, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొంది, టెండర్లు పిలిచి నిర్మాణం పూర్తయ్యే సరికి అధికారికంగా చెప్తున్న 2037 గడువు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి, ఈ హైస్పీడ్ రైలు ప్రయాణం ప్రస్తుత తరానికి కంటే, తర్వాతి తరం యువతకే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్ కమర్షియల్ వయబిలిటీ కూడా చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రయాణ ధరలతో సమానంగా బుల్లెట్ రైలు టికెట్లు ఉంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు దీనిని ఏ మేరకు ఆదరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ట్రెండింగ్ వార్తలు






















