Harish Rana Final Video: భారత్లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
Harish Rana Euthanasia | హరీష్ రాణా కారుణ్య మరణానికి ముందు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ హరీష్ తలపై చేయి నిమురుతూ మమ్మల్ని క్షమించు అని కోరుతోంది.

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ రాజ్నగర్ కు చెందిన హరీష్ రాణాకు సంబంధించిన వీడియో అందర్నీ కలచివేస్తోంది. గత 13 ఏళ్లుగా కేవలం మంచానికే పరిమితమైన 32 ఏళ్ల యువకుడు జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. సుప్రీంకోర్టు అతనికి ఇటీవల కారుణ్య మరణం (Passive Euthanasia) ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో ఈ తీరుగా ఇదే తొలి తీర్పు. తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ల పరిశీలిన, నివేదిక తరువాత ఇక అతడు కోలుకునే అవకాశమే లేదని ఇచ్చామరణం పొందేలా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హరీష్ రాణాను శనివారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. తల్లిదండ్రులు, అతడి సోదరి, బావమరిది హరీష్ రాణా వెంట ఉన్నారు. ప్రత్యేక వాహనంలో హరీష్ రానాను ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.
మమ్మల్ని క్షమించు.. ఇక హాయిగా వెళ్లు..
హరీష్ రాణా కారుణ్య మరణానికి ముందు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ హరీష్ తలపై చేయి నిమురుతూ.. మమ్మల్ని అందరినీ క్షమించూ, ఇక ప్రశాంతంగా వెళ్లమని చెబుతోంది. ఈ క్షణం ఎంత భావోద్వేగంగా ఉందంటే, ఈ వీడియో చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో హరీష్ కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మాటలు రావడం లేదు. అయితే ఆమె చెబుతున్న మాటలు వింటున్న హరీష్ రాణా క్షమించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
"सबको माफ करते हुए, सबसे माफी मांगते हुए अब जाओ, ठीक है"
— ममता ट्राबल (@Mamtasulaniya) March 15, 2026
गाजियाबाद में 13 साल से कोमा में पड़े हरीश राणा को अंतिम विदाई !! pic.twitter.com/ANaHThV1qp
జీవితాన్ని నరకంలా మార్చిన సంఘటన..
ఒకప్పుడు టాలెంటెడ్ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్న హరీష్ రాణా హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడిపోయిన ప్రమాదం తర్వాత మాట్లాడలేని, నడవలేని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని స్థితికి చేరుకున్నాడు. వైద్య పరిభాషలో దీనిని 'పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్' (Permanent Vegetative State) అని పిలుస్తారు. 13 ఏళ్ల పాటు మేషిన్లు, మెడికల్ సపోర్ట్ సాయంతో బతికిన హరీష్ చివరిదశ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అతని పరిస్థితిని గమనించిన సుప్రీంకోర్టు 'పాసివ్ యూథనేసియా' (Passive Euthanasia) అంటే అతడికి లైఫ్ సపోర్ట్ అందిస్తున్న పరికరాలను తొలగించడానికి అనుమతి ఇచ్చింది. అతడికి ఇక నరకం నుంచి విముక్తి కల్పించాలన్న తల్లిదండ్రుల కోరిక మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హరీష్ను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) పాలియేటివ్ కేర్ విభాగానికి తరలించాలని, అక్కడ అతని చివరి దశ సంరక్షణ కోసం పూర్తి సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది.

13 ఏళ్ల వేదన, ఫ్యామిలీ నిరీక్షణ
హరీష్ రాణా గత 13 ఏళ్లుగా పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడు. అంటే అతడు ప్రాణాలతో ఉన్నా కానీ మెదడు దాదాపు నిష్క్రియ స్థితిలో ఉంది. మంచానికే పరిమితమై మెడికల్ సపోర్ట్, ట్యూబ్ల సహాయంతోనే జీవితం సాగింది. తమ కుటుంబానికి ఇది చాలా కష్టకాలం అని.. తాము 4588 రోజులు ఈ బాధతో గడిపామని, తమ కుమారుడి ప్రాణాలు కాపాడుతున్న పరికరాలను తొలగించే నిర్ణయం అంతకంటే కష్టమని హరీష్ రాణా తండ్రి అన్నారు.
ఆ పరికరాలను తొలగిస్తారు
వైద్యుల ప్రకారం, కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పుడు హరీష్ ప్రాణాలు కాపాడుతున్న వైద్య పరికరాలను తొలగిస్తారు. ఈ ప్రక్రియను అత్యంత సున్నితమైన, మానవీయ పద్ధతిలో నిర్వహిస్తారు. పిఈజీ (PEG) ట్యూబ్ ద్వారా ఇచ్చే పోషకాహారం కూడా మెడికల్ ట్రీట్మెంట్ కిందకే వస్తుందని, దానిని తొలగించడం పాసివ్ యూథనేసియాలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
వీడియో చూసి కంటతడి పెట్టిన ఇంటర్నెట్
ఈ వీడియోను @Mamtasulaniya అనే ఎక్స్ (X) ఖాతా నుండి షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్.. ఇది చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అన్నారు. వీడియో చూశాక నాకు కన్నీళ్లు ఆగడం లేదని మరొకరు కామెంట్ చేశారు. కుమారుడి ప్రాణం కోసం తల్లిదండ్రులు 13 ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం కంటే.. ఇది వారికి అత్యంత బాధాకరమైన విషయం అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
























