![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Assam-Mizoram Border Clash: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ.. ఆరుగురు పోలీసులు మృతి
అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. ఇరు రాష్ట్రాలు శాంతియుతంగా ఉండాలని కేంద్రం సూచించింది.
![Assam-Mizoram Border Clash: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ.. ఆరుగురు పోలీసులు మృతి Assam-Mizoram Border Clashes Six Assam Police Men Killed in Violation Assam-Mizoram Border Clash: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ.. ఆరుగురు పోలీసులు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/27/e119ea8bb9ac1b07fbae1325fb3dc344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈశాన్య భారతంలో రాష్ట్రాల సరిహద్దు వివాదం సోమవారం భగ్గుమంది. అసోం-మేఘాలయ సరిహద్దులోని కచార్ జిల్లాలో చిన్నగా మొదలైన ఘర్షణలు చినికిచినికి గాలివానలా మారి ఏకంగా ఆరుగురు పోలీసుల ప్రాణాలను బలిగొన్నాయి. ఓ ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చర్చలు జరిపి వెళ్లిన మరుసటి రోజే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం.
మీరంటే మీరని..
కచార్ జిల్లాలో మేఘాలయ వైపు నుంచి అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు ఆరుగురు మృతి చెందారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. పొరుగు రాష్ట్రం వైపు నుంచి జరిగిన కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో కచార్ జిల్లా ఎస్పీ నింబాల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా 50 మంది సిబ్బంది గాయపడినట్లు అసోం పోలీసు విభాగానికి చెందిన అధికారి ఒకరు చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు సరిహద్దు అంశంపై చర్చలు జరుపుతుండగా అల్లరిమూకలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయని తెలిపారు. కచార్ ఎస్పీ నింబాల్కర్ తొడ భాగంలోకి తూటా దూసుకెళ్లిందని, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యుడు ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలకు కారణం అసోం పోలీసులేనని మిజోరం ఆరోపించింది.
కారణమేంటి?
సరిహద్దులో ఆక్రమణలపై అసోం, మిజోరంలు చాన్నాళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయిత్లాంగ్ సెలయేరు సమీపంలో రైతులకు చెందిన 8 వ్యవసాయ పాకలకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు దుండగులు నిప్పుబెట్టారని మిజోరం డీఐజీ లాల్బియాకాంగ ఖియాంగ్టే చెప్పారు. ఈ పాకలన్నీ సరిహద్దులో అస్సాం వైపున్న వైరెంగ్టేకి చెందిన రైతులవని వెల్లడించారు. ఈ ఘటనే తాజా ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు.
మాటల యుద్ధం
కచార్ సరిహద్దులో పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్న వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా సోమవారం మధ్యాహ్నం ట్విట్టర్లో ఉంచారు. దీనిపై దృష్టి సారించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. 'మిజోరం-అసోం సరిహద్దు ఉద్రిక్తత'గా పేర్కొన్న ఈ ట్వీట్కు ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అసోంలోని కచార్ జిల్లా కలెక్టర్, కచార్ పోలీసులను ట్యాగ్ చేసి తక్షణం దీనిని ఆపాలని కోరారు. కారులో కచార్ మీదుగా మిజోరం వస్తున్న దంపతులపై గూండాలు, దొంగలు దాడి చేశారంటూ అందుకు సంబంధించిన దృశ్యాలున్న వీడియోతో మరో ట్వీట్ చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ.. లైలాపుర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలు, కాల్పులపై మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా కల్పించుకోవాలని కోరారు.
కేంద్రం స్పందన..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాలతో ఫోన్లో మాట్లాడారు. వివాదానికి పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం లభించేలా చూడాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)