Budget Travel in India : 10,000 బడ్జెట్లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి
Affordable Travel in India : ఇండియాలో 10వేలలోపు వెళ్లగలిగే బెస్ట్ డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చూడగలిగే ప్రదేశాలు ఏంటి? ఎలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చు చేయవచ్చో చూసేద్దాం.

Best Destinations in India : భారతదేశంలో ప్రయాణించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. తెలివిగా ప్లాన్ చేస్తే చాలు. దేశంలోని అత్యంత పేరుపొందిన గమ్యస్థానాలను 10,000 బడ్జెట్లో సౌకర్యవంతంగా చూసేయవచ్చు. రాజ నగరాలు, తీరప్రాంతాల నుంచి వారసత్వ శిధిలాలు, పర్వతాలకు వెళ్లడం వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ చేయవచ్చు. ఎక్కువ ఖర్చు చేయనవసరంలేని ప్రయాణం కోసం ఇండియాలో ఏయే ప్రదేశాలకు వెళ్లొచ్చో చూసేద్దాం.
జైపూర్
జైపూర్ మీకు సినిమాటిక్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. బడ్జెట్ ప్రయాణికులకు సరైన ఎంపిక. రోజువారీ ఖర్చులు సగటున 1,200 నుంచి 1,500 మధ్య ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చరిత్ర, సంస్కృతి , ఆహారాన్ని ఆస్వాదించడానికి పింక్ సిటీకి వెళ్లవచ్చు. ఇక్కడ హాస్టల్స్ రాత్రికి 400 నుంచి ప్రారంభమవుతాయి. బడ్జెట్ హోటల్స్ 700 నుంచి 1,200 మధ్య ఉంటాయి. కచోరీలు, మిర్చి వడలు, లస్సీ వంటి స్థానిక వంటకాలు 100 లోపు లభిస్తాయి. ఆటో-రిక్షాలు, స్థానిక బస్సులు, నడవడానికి వీలున్న ప్రదేశాలు ఎంచుకోవచ్చు.
పాండిచ్చేరి
కరెక్ట్గా ప్లాన్ చేస్తే బడ్జెట్లో వెళ్లేందుకు పాండిచ్చేరి అనువైనది. బస్సులు లేదా రైళ్ల వంటి ఆర్థిక రవాణా ఎంపికలను ఎంచుకోవాలి. అలాగే ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. వైట్ టౌన్, అరబిందో ఆశ్రమం చుట్టూ డార్మ్ బెడ్లు 400 నుంచి 600 మధ్య అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ రూమ్లు 900 నుంచి 1,500 వరకు ఉంటాయి. నడవడం లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయి. ఇది మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. స్థానిక రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్ల్లో తింటే రోజుకు 300 నుంచి 500 లోపు రుచికరమైన భోజనం పొందవచ్చు. రాక్ బీచ్లో సూర్యోదయం, ప్రొమెనేడ్లో నడక, ఫ్రెంచ్ క్వార్టర్ను చూడటం మాత్రం మరచిపోవద్దు.
హంపి
అధిక ఖర్చులు లేకుండా మంచి ప్రయాణ అనుభవాన్ని పొందాలంటే హంపి వెళ్లొచ్చు. బడ్జెట్ ప్రయాణికులు హంపి బజార్, సమీప గ్రామాల చుట్టూ ఉన్న గెస్ట్హౌస్లలో రాత్రికి 600 నుంచి 1,000 వరకు వసతిని పొందవచ్చు. హంపిని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చేది ఏమిటంటే దాని వేగం. రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల మాదిరిగా కాకుండా.. ఇది మిమ్మల్ని నెమ్మదిగా అన్వేషించడానికి ఆహ్వానిస్తుంది. అరటి తోటల్లో సైకిల్ తొక్కడం, సూర్యాస్తమయ దృశ్యాల కోసం కొండలను ఎక్కడం లేదా తుంగభద్ర నది ఒడ్డున కూర్చోవడం వంటివి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ అనుభవాలలో చాలా వరకు ఉచితంగా పొందవచ్చు. మొత్తం ఖర్చు రోజుకు 800 నుంచి 1,500 మధ్య ఉంటుంది. విరూపాక్ష దేవాలయం నుంచి విట్టల దేవాలయం వరకు, ఆర్థిక ఒత్తిడి లేకుండా సాంస్కృతిక లోతును అందిస్తుంది.
చిరపుంజి
చిరపుండి అద్భుతమైన సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ జలపాతాలు, గుహలు, పచ్చని ప్రకృతి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ మూడు రోజుల పర్యటనను జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 7,000 నుంచి 9,000 వరకు సౌకర్యవంతంగా సరిపోతుంది. హోమ్స్టేలు, గెస్ట్హౌస్లలో వసతి రాత్రికి 1,200 నుంచి 2,000 మధ్య ఉంటుంది. ఇది సౌకర్యం, స్థానిక ఆతిథ్యాన్ని అందిస్తుంది. షేర్డ్ టాక్సీలు, స్థానిక బస్సులను ఎంచుకోవడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించవచ్చు. స్థానిక రెస్టారెంట్లలో ఫుడ్స్ ట్రై చేయవచ్చు.
మనాలి
మనాలి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొండ గమ్యస్థానాలలో ఒకటి. సరైన విధానంతో ప్లాన్ చేస్తే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఢిల్లీ నుంచి రాత్రి బస్సులో ప్రయాణిస్తే ట్రావెల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే రాత్రి వసతిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ ప్రయాణికులకు తెలివైన ఎంపిక. హాస్టల్స్, హోమ్స్టేలు వంటి బస ఎంపికలు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.1,500 నుంచి 2,000 మధ్య సౌకర్యవంతమైన గదులను తీసుకోవచ్చు. స్థానిక కేఫ్లు, ధాబాలను ఎంచుకోవడం ద్వారా ఆహార ఖర్చులు తగ్గుతాయి. ఓల్డ్ మనాలిని అన్వేషించడం, హిడింబా ఆలయాన్ని సందర్శించడం, బియాస్ నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం లేదా పైన్ అడవుల గుండా నడవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి. సోలాంగ్ వ్యాలీకి వెళ్లే ప్రయాణాలను కూడా షేరింగ్ ట్రావెల్ చేస్తే ఆర్థికంగా మరింత బెనిఫిట్స్ పొందవచ్చు.

























