Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
Sai Madhav Burra Vs Saraswathi Movie: వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయమైన 'సరస్వతి'కి సాయి మాధవ్ బుర్రా కథ, మాటలు రాశారు. అయితే తన కథను మార్చారని ఆయన పోస్ట్ చేశారు.

Varalaxmi Sarathkumar vs Sai Madhav Burra: 'సరస్వతి' సినిమాతో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా కథ, సంభాషణల రచయిత. మార్చి 6న థియేటర్లలోకి వచ్చిందీ సినిమా. ఆ రోజు సాయంత్రం సోషల్ మీడియాలో సాయి మాధవ్ బుర్రా ఓ పోస్ట్ చేశారు. వరలక్ష్మి పేరును ఆయన రాయలేదు. కానీ, ఆ పోస్ట్ చూస్తే వరలక్ష్మిని టార్గెట్ చేశారని అర్థం అవుతోంది. మార్చి 7న ఉదయం నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయి మాధవ్ బుర్రా పోస్ట్ మీద వరలక్ష్మి స్పందించారు.
సాయి మాధవ్ బుర్రా ఏం పోస్ట్ చేశారంటే?
''నా కథతో (సరస్వతి) మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు (కథను). కథను మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు... నా సోల్ వేరు, అసలా కథే వేరు'' అని సాయి మాధవ్ బుర్రా పోస్ట్ చేశారు. మార్చి 6న 'సరస్వతి' విడుదలైంది కనుక ఆ సినిమాపై ఆయన పోస్ట్ చేశారని అర్థమైంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మాటలతో ఆమె సినిమా గురించి ఆయన పోస్ట్ చేశారని అర్థమైంది.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
నా క్లైమాక్స్, నా డైలాగులకు క్లాప్స్ పడ్డాయి!
సాయి మాధవ్ బుర్రా అందించిన కథలో మార్పులు చేసినట్టు 'సరస్వతి' సక్సెస్ మీట్లో వరలక్ష్మీ శరత్ కుమార్ అంగీకరించారు. సాయి మాధవ్ బుర్రా పోస్ట్ మీద ఆమెను ప్రశ్నించగా... ''నాకు సాయి గారి మీద గౌరవం ఉంది. మన ప్రపంచంలో కొన్ని కథలకు అలా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చదు. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. ఆయనకు డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. ఆయన దగ్గర ఆ కథ ఆరేళ్ళు ఉంది. కథ బావుంటే అన్నేళ్లు ఎందుకు చేయలేదు? నేను కథను ఎక్కడ చెప్పినా సెకండాఫ్ బాలేదని అన్నారు. అసలు సాయి మాధవ్ బుర్రా మమ్మల్ని కలవలేదు. ఆయన బాగా బిజీ. పెద్ద సినిమాలకు వెళ్లిపోయారు. వాయిస్ / ఆడియో నోట్స్ పంపించారు. ఆ కథపై నేను వర్క్ చేశా. ప్రతి ఇంటర్వ్యూలో కథ లైన్ తీసుకుని, స్క్రీన్ ప్లే మార్చనని చెప్పాను. ఆయన మీద గౌరవంతో కథ ఆయనది అని క్రెడిట్ ఇచ్చాను'' అని చెప్పారు.
సాయి మాధవ్ బుర్రా కథను మార్చినట్టు చెప్పడమే కాదు... తాను రాసిన మాటలు, క్లైమాక్స్ వంటి అంశాలకు థియేటర్లలో క్లాప్స్ పడ్డాయని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు. ''మేం స్టార్స్ కాదు... మంచి ఆర్టిస్టులు. ఒకవేళ స్టార్స్ ను తీసుకుని ఈ కథ చేస్తే వర్కవుట్ అయ్యేది ఏమో!? ఆయన ఒక్క సిట్టింగ్ కు కూడా రాలేదు. ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి నేను చూసుకున్నా. ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ మీద తీసిన సినిమా మీద 'రేప్' వంటి పదం వాడకూడదు. మా మధ్య జరిగినవి చెప్పి నా స్థాయిని కిందకు దించుకోలేను. ముందు నుంచి క్లైమాక్స్ మార్చాలని చెప్పాను. కోర్టులో కథ ముగిస్తే బాగోదు. నేను ఒక ట్విస్ట్ ఇచ్చాను. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అని చెప్పారు. ఇప్పుడీ వివాదం ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ అవుతోంది.



















