Baahubali The Epic Trailer: మాహిష్మతి సామ్రాజ్యం కోసం 'బాహుబలి' వచ్చేశాడు - 'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ ట్రైలర్ వేరే లెవల్... రన్ టైం ఎంతో తెలుసా?
Baahubali The Epic: 'బాహుబలి: ది ఎపిక్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుండగా... తాజాగా రిలీజ్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Prabhas's Baahubali The Epic Trailer Out: ఇద్దరు సోదరులు... మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం... పీఠం కోసం ఓ సోదరుడి క్రూరత్వం... తన తండ్రిని దారుణంగా వెన్నుపోటు పొడిచి మరీ చంపి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారని తెలుసుకున్న ఆ కొడుకు పెదనాన్నపై చేసే పోరాటం. ఇదీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి' స్టోరీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది.
ఈ మూవీని 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' అంటూ రెండు పార్టులుగా తెరకెక్కించగా... రిలీజై ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రెండు భాగాలను కలిపి ఒకే మూవీ 'బాహుబలి: ది ఎపిక్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కీలక సన్నివేశాలను చూపిస్తూ చేసిన ట్రైలర్ కట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'నన్ను ఎప్పుడూ చూడని కళ్లు దేవుడిలా చూస్తున్నాయి. నేనెవరిని?' అంటూ శివుడు కట్టప్పను ప్రశ్నించే సీన్తో ట్రైలర్ ప్రారంభం కాగా... అఖండ మాహిష్మతి సామ్రాజ్యం, శివుడి అవంతికల ప్రేమాయణం, కాళకేయులతో బాహుబలి, భళ్లాల దేవుని యుద్ధం, తన తండ్రిని వెన్నుపోటు పొడిచిన తన పెదనాన్న రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడని తెలుసుకున్న శివుడు, కట్టప్పతో కలిసి మాహిష్మతి సామ్రాజ్యం కోసం చేసే పోరాటం అన్నింటినీ కలిపి ట్రైలర్లో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. 'బాహుబలి: ది ఎపిక్'లో ఓ సర్ ప్రైజ్ మాత్రం ఆశించవచ్చని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ అన్నారు. దీంతో ఆ సర్ ప్రైజ్ ఏంటా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మూవీని ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తుండగా... ఈ నెల 29న ఐమాక్స్ వెర్షన్ ఫస్ట్ డే ఫస్ట్ షో వేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 4 డీఎక్స్, ఎక్స్ బాక్స్ వంటి ఇతర వెర్షన్లలోనూ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్కు ముందు ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కూడా పాల్గొననున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్ల తర్వాత అందరూ కలిసి ఒకే వేదికపై రానున్నారు.
రన్ టైం ఎంతంటే?
'బాహుబలి'ని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక 'బాహుబలి: ది ఎపిక్' రన్ టైంను ఫైనల్గా 3 గంటల 44 నిమిషాలుగా లాక్ చేశారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.





















