Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
AP High Court on Actor Mohan Babu | విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని నటుడు మోహన్ బాబు మద్యంతర పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

అమరావతి: సినీ నటుడు, మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని మోహన్ బాబు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్ను సైతం కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక సమాచారాన్ని అందించారు. కిడ్నాప్ ఘటనకు ముందు, తర్వాత యూనివర్సిటీ పీఆర్వో (PRO) సతీష్తో నటుడు మోహన్ బాబు నిరంతరం ఫోన్లో మాట్లాడారని, వారి మధ్య మెసేజ్లు కూడా మారాయని పోలీసులు ఆధారాలను చూపిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కేసుకు సంబంధించిన మెయిన్ పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.
అసలు వివాదం ఏంటీ.. ఏం జరిగింది..
మోహన్ బాబు యూనివర్సిటీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఫీజుల విషయంలో గతంలోనూ కోర్టు వరకు విషయం వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఎంబీయూలో ఫీజుల పెంపు, ఇతర విద్యార్థి సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థి నాయకుల కిడ్నాప్ కావడం వివాదానికి దారితీసింది.
మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన కొందరు విద్యార్థి సంఘం నాయకులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే, దర్యాప్తు లోతుగా సాగగా, ఈ మొత్తం వ్యవహారంలో ఛాన్సలర్ మోహన్ బాబు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కిడ్నాప్ జరిగిన సమయంలో మోహన్ బాబు, పీఆర్వో సతీష్ మధ్య జరిగిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ మెస్సేజ్లను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాల ప్రకారమే మోహన్ బాబును కేసులో నిందితుడిగా చేర్చి, చర్యలు తీసుకునేంకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తనపై కొందరు కక్షపూరితంగా కేసు పెట్టారని, అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని నటుడు మోహన్ బాబు ఏపీ కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. కానీ పోలీసుల వాదన, వారు చెప్పిన విషయాలతో ఏకీభవించిన కోర్టు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోకూడదన్న పిటిషన్ను కొట్టివేసింది. కేసు పూర్తి స్థాయి విచారణ జరగాలని భావించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మార్చి 3కి వాయిదా వేశారు.
























