Kidnapping case against Mohan Babu: బౌన్సర్లతో విద్యార్థి నేతల అపహరణ - మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు
MBU Mohanbabu: విద్యార్థి నేతల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో మోహన్ బాబుపై తిరుచానూరు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎంబీయూ ఎదుట ధర్నా చేస్తున్న వారిని అపహరించారని ఆరోపణలు వస్తున్నాయి.

Case On Mohan Babu at Tiruchanur station : సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుతో పాటు వారి పీఆర్వో సతీష్పై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. మోహన్ బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, నాయకుడు వినోద్లను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందింది. విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 కిడ్నాప్ , 323 దాడి , 506 బెదిరింపు, రెడ్ విత్ 120B నేరపూరిత కుట్ర కింద మోహన్ బాబు, విష్ణు, సతీష్లను నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు.
ఎస్ఎఫ్ఐ నేతల్ని కిడ్నాప్ చేశారని ఆరోపణలు
మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నేతలను సుమారు 30 మంది బౌన్సర్లు వాహనాల్లో వచ్చి అడ్డగించారు. వారిపై అమానుషంగా దాడి చేసి, బలవంతంగా వాహనాల్లోకి లాక్కెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి వెంటనే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందాలు కిడ్నాపర్ల వాహనాలను వెంటాడాయి. చివరకు నారా వా రిపల్లి సమీపంలోని భీమవరం వద్ద వాహనాలను అడ్డుకుని, అక్బర్ , వినోద్లను పోలీసులు సురక్షితంగా విడిపించారు.
కిడ్నాప్ కు పాల్పడిన వారంతా మోహన్ బాబు బౌన్సర్లుగా గుర్తింపు
కిడ్నాప్నకు పాల్పడిన వారంతా మోహన్ బాబు విద్యాసంస్థల బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన విద్యార్థి నాయకులను మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్కు తరలించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన ఐదుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేసి, వారు ఉపయోగించిన రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ కిడ్నాప్ వెనుక మోహన్ బాబు, మంచు విష్ణు , పీఆర్వో సతీష్ ప్రోద్బలం ఉందని, వారి ఆదేశాల మేరకే తమను నిర్బంధించారని బాధితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
కేసు నమోదు చేసిన పోలీసులు - నోటీసులు జారీ చేసే అవకాశం
మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయాలని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఎంబీయూ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















