Delhi Election Result 2025: బీజేపీ, ఆప్ మధ్య 2 శాతమే ఓట్ల తేడా - కాంగ్రెస్కు 6 శాతం ఓట్లు - చేసిన తప్పేమిటో కేజ్రీవాల్కు అర్థమవుతుందా ?
Election Results: కాంగ్రెస్ ను కలుపుకోకపోవడం వల్లనే ఆమ్ ఆద్మీ ఓటమి పాలయింది. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే దీనికి నిదర్శనం.

Delhi Assembly Election Result 2025: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఓట్ల చీలిక. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయడంతో ఆ పార్టీకి ఆరున్నర శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ,ఆప్ మధ్య ఓట్ల శాతం.. రెండు శాతం కంటే తక్కువ ఉంది. అదే కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ కలుపుకుని ఉంటే.. గెలుపు ఈజీగా దక్కేది. కానీ కేజ్రీవాల్ కాంగ్రెస్ ను దూరం చేసుకున్నారు. అంటే విజయాన్ని దూరం చేసుకున్నారని అనుకోవచ్చు.
కాంగ్రెస్ చీల్చిన ఓట్ల వల్లే ఆప్కు విజయం దూరం
ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుందని ఓట్ల శాతం చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ.. అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది. కానీ ఈ సారి మాత్రం పదకొండేళ్ల పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ను దూరం చేసుకోవడమే కాదు అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని అతిశయోక్తికి పోయి మొదటికే మోసం తెచ్చుకున్నారు. పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ఓట్ల తేడా చాలా స్వల్పం - కాంగ్రెస్ ఓట్లే కీలకం
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లు 46 శాతం. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 44 శాతం . అంటే రెండు పార్టీల మధ్య తేడా రెండు శాతం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ తో ఆప్ కలసి పని చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కలసి రాలేదు. ఆ స్నేహాన్ని కొనసాగించి ఉంటే.. ఓట్ల బదిలీ జరిగి ఉండేది. కేజ్రీవాల్, సిసోడియా వంటి వాళ్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారైనా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ సారి కూడా రాలేదు. కానీ ఈ సారి నాలుగు శాతం ఓట్లు పెరిగాయి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయింది. హర్యానాలో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేసింది. అక్కడ ఆమ్ ఆద్మీని కలుపుకుని ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. కానీ చేయలేదు. ఢిల్లీలో ఆప్ అదే తప్పు చేసింది. నిండా మునిగిపోయింది.
రాజకీయంలో అహం కాదు.. ఈక్వేషన్స్ ముఖ్యం
ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి ఫలితాలను ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని.. ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ కు ఝులక్ ఇచ్చింది. అంతేనా ఇండియా కూటమి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. అంతిమంగా అది కూడా కేజ్రీవాల్ ఓటమికి.. బీజేపీ విజయానికి కారణం అయిందని అనుకోవచ్చు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా కేజ్రీవాల్ ఓటమికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం కేజ్రీవాలే అవుతారు. అసలైన సవాళ్లు ఆయనకు ఇక నుంచి ఎదురు కానున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

