MBU: ప్రయాణికుల భద్రతకు క్యూఆర్ కోడ్ రక్ష - ఎంబీయూ విద్యార్థి సహకారంతో పోలీసుల వినూత్న ప్రయోగం
QR Code Security: ఎన్టీఆర్ జిల్లా పోలీసులు క్యూఆర్ కోడ్ ఆధారిత రియల్ టైమ్ ట్రావెలర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఎంబీ యూనివర్శిటీ విద్యార్థి సహకారం అందించారు.

QR Code Security MB University Collaboration: ప్రజా రవాణా, రెంటల్ వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఒక వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ రియల్ టైమ్ ప్రొటెక్షన్ సిస్టమ్ను కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రయాణికులు వాహనం ఎక్కగానే డ్రైవర్ సీటు వెనుక ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్ సమాచారాన్ని తక్షణమే తెలుసుకోవచ్చు. అదే సమయంలో ప్రయాణికుడి లైవ్ లొకేషన్ పోలీస్ కంట్రోల్ రూమ్, సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు షేర్ అవుతుంది.
విద్యార్థి ఆవిష్కరణకు పోలీసుల తోడ్పాటు
విశేషమేమిటంటే, ఈ అత్యాధునిక సాంకేతికతను తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో నాలుగో ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న జి. శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేశారు. తన స్టార్టప్ SAS ఎలక్ట్రానిక్స్ LLP ద్వారా ట్రాఫిక్ డిసిపి షేక్ షరీనా బేగం మార్గదర్శకత్వంలో ఈ వ్యవస్థను రూపొందించారు. ఆటో రిక్షాలు, ఓలా, ఉబెర్, రాపిడో వంటి అగ్రిగేటర్ వాహనాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సామాజిక భద్రత కోసం ఇలాంటి పరిష్కారాన్ని కనుగొనడంపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
అత్యవసర సమయంలో మెరుపు వేగంతో స్పందన
ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నా లేదా ప్రమాదకరంగా వాహనాన్ని నడిపినా, ప్రయాణికులు వెంటనే అలర్ట్ చేయవచ్చు. లైవ్ లొకేషన్ నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉండటం వల్ల అత్యవసర సమయంలో స్పందన సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థలో రేటింగ్ , ఫీడ్బ్యాక్ మెకానిజంను కూడా చేర్చారు. వరుసగా తక్కువ రేటింగ్ వచ్చే డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు.
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
ఈ సందర్భంగా ట్రాఫిక్ డిసిపి షేక్ షరీనా బేగం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణికులకు భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రాణనష్టాన్ని ఇలాంటి సాంకేతిక చర్యల ద్వారా నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో అమలవుతున్న ఈ విధానం, భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కోసం మరో ప్రత్యేక అప్లికేషన్ను కూడా సిద్ధం చేస్తున్నారు























