డిగ్రీ పట్టాలు పొందిన యువతకు ఉద్యోగాలు లభించడం లేదని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. విద్యావిధానానికి, ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు మధ్య ఉన్న అగాధాన్ని ఇది బయటపెట్టింది.
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్ నివేదిక!
Niti Aayog:భారత్లో డిగ్రీలు పొందుతున్న వారిలో కేవలం 8.25శాతం మందే తగిన ఉద్యోగాలు సాధిస్తున్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రాక్టికాలిటీ, కాలం చెల్లించిన సిలబస్ దీనికి కారణమని చెప్పింది.

- నీతి ఆయోగ్ నివేదిక విద్యా-ఉద్యోగ మార్కెట్ అగాధం చూపింది.
- 8.25% గ్రాడ్యుయేట్లకు మాత్రమే అర్హత ఉద్యోగాలు దక్కుతున్నాయి.
- పాత సిలబస్, నైపుణ్య లోపం సమస్యను తీవ్రం చేస్తున్నాయి.
- ప్రాక్టికల్ పరిజ్ఞానం లేక యువత ఉద్యోగాలకు దూరమవుతోంది.
Niti Aayog Report On Indian Education System: భారత్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో యువత డిగ్రీ పట్టాలతో కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఆ చేతికి అందుతున్న సర్టిఫికెట్లు మార్కెట్లో వారికి ఉద్యోగాలు లభించడం లేదని తేలింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యూహాత్మక, టెక్నికల్ సలహాలను అందించే అత్యున్నత థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక దేశంలోని విద్యారంగంలో ఉన్న ఒక భయానక సత్యాన్ని, విద్యా సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. మంగళవారం నాడు నీతి ఆయోగ్ ప్రచురించిన రీఇమేజింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047 అనే పత్రం భారత్లో విద్యావిధానానికి, ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు మధ్య ఉన్న అగాధాన్ని బయటపెట్టింది.
ఆర్థిక సర్వే 2024-25 గణాంకాలను ఉటంకిస్తూ ఈ నివేదిక వెల్లడించిన అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, భారత్లో కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే తాము అభ్యసించిన చదువులకు, అర్హతలకు తగిన ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అంటే మిగిలిన 91.75 శాతం మంది గ్రాడ్యుయేట్లు తాము చదివిన చదువుకు ఎటువంటి సంబంధం లేని పనుల్లో లేదా తక్కువ వేతనాల ఉద్యోగాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. లేదా అసలు ఉద్యోగమే లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది కేవలం నిరుద్యోగ సమస్య మాత్రమే కాదు, విద్యార్థుల చదువులకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలనకు మధ్య ఏర్పడిన లోతైన అగాధం. ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడింది, లక్షలాది మంది యువత జీవితాలు డిగ్రీలు ఉన్న ఎందుకు ఏర్పడింది? లక్షలాది మంది యువత జీవితాలు డిగ్రీలు ఉన్నా ఎందుకు నిరర్ధకంగా మారుతున్నాయో నివేదిక చెప్పింది.
ఈ నివేదికలోని అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. యువత తమ అమూల్యమైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఖర్చు చేసి డిగ్రీలు పొందుతున్నప్పటికీ, ఉద్యోగ మార్కెట్కు అవసరమైన కనీస నైపుణ్యాలు వారిలో ఉండం లేదనే వాస్తవాన్ని ఈ నివేదిక నిరూపించింది. ఇది కేవలం ఒక విధానపరమైన పత్రం కాదు. భారత్లోని విద్యావ్యవస్థ మూలాలను ప్రశ్నించే ఒక తీవ్రమైన హెచ్చరిక మన విద్యా సంస్కరణలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దేశ ఆర్థిక పురోగతి దెబ్బతినే ప్రమాదం ఉంది.
డిగ్రీలపై భయానక నిజాలు
భారత్లో ఉన్నత విద్య కోసం విపరీతంగా ఖర్చు చేసిన, సంవత్సరాల తరబడి శ్రమించి పట్టాలు పొందుతున్న యువత సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కానీ, ఈ డిగ్రీల వల్ల వారికి మంచి కెరీర్ లభించడం లేదు. భారత్లో ఉన్నత, టెక్నికల్ విద్యావ్యవస్థలో విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలకు, శ్రామిక మార్కెట్ ఆశించే నైపుణ్యాలకు మధ్య ఉన్న పెద్ద లోపం స్పష్టంగా కనిపిస్తోందని నీతి ఆయోగ్ గుర్తించింది. అనేక విద్యాసంస్థల్లో ఇప్పటికే కాలం చెల్లిన సిలబస్ బోధిస్తున్నారు. పరిశ్రమల అవసరాలు వేగంగా మారుతున్నప్పటికీ, ఆ మార్పులకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. దీని వల్ల విద్యార్థులు సాధించే డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు వారి నైపుణ్యాలను ప్రతిబింబించలేకపోతున్నాయి. వారికి ఉపాధి కల్పించలేకపోతున్నాయి.
ప్రస్తుత విద్యావ్యవస్థ కేవలం మార్కులు, పరీక్షల ఫలితాల ఆధారంగానే విజయాన్ని అంచనా వేస్తోంది. నిజమైన ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం లేదు. డిగ్రీ పూర్తి చేసిన ఒక యువకుడు లేదా యువతి సమాంలోకి అడుగుపెట్టినప్పుడు , తాము సాధించిన చదువు మార్కెట్ అవసరాలకు ఎంతమాత్రం సరిపోవడం లేదని గ్రహిస్తున్నారు. ఈ పరిస్థితి గ్రాడ్యుయేట్లో నిరాశను పెంచుతోంది.
భారత్లో సాధారణ సంప్రదాయ డిగ్రీల వైపు విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థలోని గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్ఫష్టమవుతోంది. దేేశంలో అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో చేసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 3.4 కోట్లు. ఇందులో కేవలం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుల్లోనే ఏకంగా 1.13 కోట్ల మంది చేరారు. ఇక బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులను కలిపి చూస్తే 2 కోట్లకు దాటిపోతుందీ సంఖ్య.
ఈ సాధారణ డిగ్రీ ప్రోగ్రామ్లకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య అనుసంధానం చాలా బలహీనంగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో ఎందుకు చేరుతున్నారు. దీనికి ఒకే ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలకు హాజరుకావడానికి ఈ డిగ్రీలు కనీస అర్హతగా ఉపయోగపడతాయనే ఆశతోనే ఇలా చేస్తున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత తమకు కచ్చితమైన ఉపాధి లభిస్తుందనే నమ్మకంతోనే కాకుండా, ప్రభుత్వ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అర్హత పత్రం కోసం మాత్రమే ఈ డిగ్రీలు పొందుతున్నారు. దీని ప్రతిఏటా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్ నివేదిక బయటపెట్టిన ఈ చేదు నిజాలకు సరిగా సరిపోయే విధంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆగస్టు 17 నాడు ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావిధానం, ఉద్యోగాల మార్కెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. చదువు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాలు సాధించలేకపోతున్న, అదే సమయంలో ఎటువంటి శిక్షణ లేదా ఇతర విద్యాకోర్సులు చేయకుండా ఖాళీగా ఉంటున్న యువతపై ఆమె స్పందించారు. " కాలేజీలలో పూర్తి చేసిన కోర్సులు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడం లేదు. వారిని కొత్త పారిశ్రామికవేత్తలుగా కూడా ప్రోత్సహించడం లేదు.' అని అన్నారు.
లక్ష్యం లేని జనరిక్ డిగ్రీలు
భారత్లో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఒక భారీ ప్యాక్టరీలా మారింది. ఇది ఏటా లక్షలాి మంది గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది. కానీ వారిలో ఎంతమంది ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం దొరకడం లేదు. దీనికి జనరిక్ డిగ్రీ వ్యవస్థే కారణం. ఈ సంప్రదాయ కోర్సులు విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయే తప్ప వారిలో విశ్లేషణాత్మక ఆలోచనను, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని పెంచవు. ఈ కారణంగానే చాలా కంపెనీలు డిగ్రీలు ఉన్నప్పటికీ కొత్త గ్రాడ్యుయేట్లకు మళ్లీ మొదటి నుంచి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. కనీసం ఈమెయిల్ రాయడం, ఎక్సెల్ షీట్ల తయారీ, టైపింగ్, లాంటి ప్రాథమిక నైపుణ్యాలు కూడా సంప్రదాయ బీఏ, బీఎస్సీ, కోర్సుల్లో నేర్పించడం లేదు. ఇది యువకులకు శాపంగా మారుతోంది.
విద్యార్థుల ఆవేదన కూడా అదే
సమస్యలను విద్యార్థులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. నీతి ఆయోగ్ నివేదిక ఈ లోపాలను విద్యార్థుల కోణం నుంచి కూడా విశ్లేషించింది. దాదాపు 34 శాతం మంది విద్యార్థులు తమ డిగ్రీ చదువుల సమయంలో నైపుణ్యాల కొరతను అతి పెద్ద సమస్యగా పేర్కొన్నారు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల 18 శాతం మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 80 శాతం మంది అభ్యర్థులు తమ డిగ్రీలలో ప్రాక్టికల్ పరిజ్ఞానం, పరిశ్రమల అనుభవం లోపించడమే ప్రధాన అడ్డంకిగా మారుతోందని వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూ
కార్పొరేట్ రంగానికి, ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సంప్రదాయ చదువుల ద్వారా లభించపోవడంతో , దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రభుత్వం ఉద్యోగాలే ఏకైక ఆశ్రయంగా మారుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడం, ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ కొలువుల వైపు పరుగులు పెడుతున్నారు.
కళాశాలలకు, పరిశ్రమకు మధ్య తెగిన బంధం
నీటి ఆయోగ్ తన నివేదికలో కేవలం సిలబస్లోని లోపాలను మాత్రమే కాకుండా కళాశాలల నిర్వహణలోని అనేక ఇతర లోపాలను కూడా ఎండగట్టింది. ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థల్లో కరికులం దాటి విద్యార్థులకు లభించాల్సిన కనీస ఉపాధి మద్ధతు కొరవడిందని పేర్కొంది.విద్యాసంస్థల్లోని విద్యార్థులు కనీసం ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా రాయాలి, మాక్ ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించాలి, ఉద్యోగాల కోసం ఎలా శోధించాలనే విషయాలపై ఎటువంటి అవగాహన ఉండటం లేదు. దీని వల్ల విద్యార్థులు నేరుగా జాబ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రతిభ ప్రదర్శించలేకపోతున్నారు.
అధ్యాపకులు సరికొత్త టెక్నాలజీ, సబ్జెక్ట్ బోధిస్తున్నప్పటికీ వారికి పరిశ్రమల అవసరాలపై కనీస అవగాహన ఉండటం లేదు. తగిన మౌలిక సదుపాయాలు, ల్యాబ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితమవుతున్నారు. ఈ లోపాలు దేశంలో ఒక విషవలయాన్ని సృష్టిస్తున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు అనుభవం ఉన్న అభ్యర్థును కోరుకుంటాయి. కానీ కొత్త పట్టాలు పొందిన గ్రాడ్యుయేట్లకు ఎలాంటి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. కళాశాలలు పరిశ్రమలతో అనుసంధానం కాకపోవడం వల్ల విద్యార్థులకు ఆ అనుభవాన్ని కల్పించలేకపోతున్నాయి.
Frequently Asked Questions
నీతి ఆయోగ్ నివేదిక భారతీయ విద్యావ్యవస్థ గురించి ఏమి వెల్లడించింది?
ఎంతమంది గ్రాడ్యుయేట్లు తమ చదువులకు తగిన ఉద్యోగాలు పొందుతున్నారు?
ఆర్థిక సర్వే 2024-25 గణాంకాల ప్రకారం, కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే తమ చదువులకు తగిన ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మిగిలిన 91.75 శాతం మంది సంబంధం లేని పనుల్లో లేదా నిరుద్యోగులుగా ఉన్నారు.
గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
అనేక విద్యాసంస్థల్లో కాలం చెల్లిన సిలబస్ బోధిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందడం లేదు, ఇది ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు సరిపోవడం లేదు.
చాలా మంది విద్యార్థులు సాంప్రదాయ డిగ్రీలను ఎందుకు ఎంచుకుంటున్నారు?
ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలకు ఈ డిగ్రీలు కనీస అర్హతగా ఉపయోగపడతాయనే ఆశతో విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఇది ఉద్యోగం కోసం కాకుండా అర్హత పత్రం కోసం మాత్రమే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















