Minister Lokesh : ప్రభుత్వ కాలేజీల్లో టాపర్లకు లోకేష్ సన్మానం, నేనూ రుద్దుడు బ్యాచ్చేనంటూ కామెంట్
Minister Lokesh : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్ లుగా నిలిచిన విద్యార్థులను మంత్రి లోకేష్ సన్మానించారు. తాను కూడా రుద్దుడు బ్యాచ్చేనంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ మూడేళ్లు కష్టం మార్చేసిందని వివరించారు

Minister Lokesh : ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్మానించారు. ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ " మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారని" అన్నారు.
"మీరంతా విజేతలు. మీకు హ్యాట్సాఫ్. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్ ట్యాప్లను బహూకరించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.."ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థుల విజయాన్ని సెలబ్రేటే చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాను. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. పాయకాపురంలో ఓ చెల్లితో మాట్లాడినప్పుడు.. తల్లిదండ్రులను కోల్పోయిన తనను చేపలమ్మి వాళ్ల అమ్మమ్మ చదివిస్తోందని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించడం వల్ల ఆమెపై భారం తగ్గిందని" చెప్పారు.
లోకేష్ ఇంకా మాట్లాడుతూ "మీరందరూ విజేతలు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్ర చెరిపేశారు. మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆడుతూ, పాడుతూ ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని. పదో తరగతికి వచ్చిన తర్వాత బాగా రుద్దారు. నేను కూడా రుద్దుడు బ్యాచ్. తర్వాత ఇంటర్ రెండేళ్లు బాగా కష్టపడ్డాను. మూడేళ్లపాటు చాలా కీలక సమయం. తర్వాత స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాను. వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. టెక్ట్స్, నోట్ పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాం. ప్రిన్సిపల్స్కు ప్రమోషన్లు ఇచ్చాం. ఇలా చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి అనంతరం లెర్నింగ్ అవుట్ కమ్స్పై దృషి పెడతాం" అని చెప్పారు.
ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం : విద్యార్థుల భావోద్వేగం
ఒకేషనల్లో విద్యనభ్యసించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తుమ మార్కులు సాధించిన 52 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. పలువురు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. పలు సమస్యలను, భవిష్యత్ ప్రణాళికలను మంత్రి లోకేష్తో పంచుకున్నారు. ఉన్నత చదువులకు సాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి, అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
52 మంది విద్యార్థుల్లో 43 మంది బాలికలు కాగా 9 మంది బాలురు ఉన్నారు. వీరిలో ఆరుగురు విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వారిలో కొందరి అభిప్రాయాలు ఈ విధంగా...
మా లాంటి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం అన్నారు. ఎంపీసీలో 986 మార్కులు సాధించిన కర్నూలు టౌన్ ప్రభుత్వ కాలేజీలో చదివిన బండి పావని. స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. "మా తల్లిదండ్రులు నా మార్కులు చూసి చాలా గర్వపడుతున్నారు. లోకేష్ గారు మంత్రిగా వచ్చిన తర్వాత టెక్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందించారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మాలాంటి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. మాకు జేఈఈ మెయిన్స్ కోచింగ్ లేకపోయినా జూనియర్స్కు ఇస్తున్నారు. మాకు ఆర్థికంగా సహకారంతోపాటు పై చదువులకు కాలేజీలో ఉచితంగా సీటు, కోచింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని చెప్పారు
లోకేష్ సన్మానిస్తారని కలలో కూడా ఊహించలేదు
హైస్కూల్ ప్లస్ గర్ల్స్, మైలవరం, కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వం హైస్కూల్ ప్లస్ గర్ల్స్ స్కూల్లో చదివిన భుక్యా హరిణి బైపీసీలో 978 మార్కులు సాధించారు. ఆమె మాట్లాడుతూ... "మా నాన్నగారు రోజు కూలీకి వెళ్తారు. నేను చిన్నప్పటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రైవేటు కాలేజీలో చదవాలనే కోరిక ఉండేది. అయినా మా ఆర్థిక పరిస్థితి కారణంగా చదవలేకపోయాను. హైస్కూల్ ప్లస్లో బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీంతో నా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అత్యధిక మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు చాలా మద్దతు ఇచ్చారు. పుస్తకాలు కూడా అందించారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం పొందుతానని కలలో కూడా ఊహించలేదు. నాకు తెలిసిన అమ్మాయి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకుంది. నేను కూడా బాగా చదివి అవార్డు పొందాలనుకున్నాను. ఇప్పుడు మీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను. నేను గైనకాలజిస్ట్ కావాలనేది లక్ష్యం. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి. నాకు ఉచితంగా కోచింగ్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అని విజ్ఞప్తి చేశారు.
పారా ఒలంపిక్స్లో మెడల్ సాధిస్తా
నిమ్మకూరులోని ఎన్ఎల్వీఆర్ జీఎస్ఆర్వీ జూనియర్ కాలేజీలో చదువుకున్న వల్లెపు కుసుమ శ్రీలక్ష్మీ కుమారి అని దివ్యాంగ విద్యార్థి సీఈసీలో 827 మార్కులు సాధించారు. ఆమె మాట్లాడుతూ..."మాది పల్నాడు జిల్లా గుత్తికొండ గ్రామం. అక్కడ పనులు లేక మా తల్లిదండ్రులు గుంటూరుకు వలస వచ్చి పలకలూరులోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. నాకు దివ్యాంగ కోటాలో సీఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మంత్రి లోకేష్ చేతుల మీదుగా నాకు ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. నా మొదటి సన్మానం లోకేష్ చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నా. గతేడాది మాకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఈ ఏడాది అందించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ వల్ల షటిల్, క్యారమ్స్ నేర్చుకున్నాను. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ మాదిరిగా పారా ఒలంపిక్స్లో పాల్గొని మెడల్ సాధిస్తాను. పీ-4 వల్ల నాలాంటి వారికి చాలా ఉపయోగం ఉంటుంది. చదువు విషయంలో నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. పై చదువులకు మీ సాయం కావాలి. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. దివ్యాంగులకు నా వంతు సాయం చేస్తాను." అని అన్నారు.

902 మార్కులు తెచ్చుకుని మీ ముందు నిల్చొన్నాను
పల్నాడు జిల్లా రూపెనగుంట్ల మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో చదివిన జంగా కీర్తన అనే దివ్యాంగ విద్యార్థిని ఎంపీసీలో 902 మార్కులు సాధించారు. ఆమె మాట్లాడుతూ..."నాకు చెవులు సరిగా వినిపించవు. నేను చదవలేనని చుట్టుపక్కల వారు హేళన చేసేవారు. మా నాన్న బాగా ప్రోత్సహించారు. 902 మార్కులు తెచ్చుకుని మీ ముందు నిల్చొన్నాను. ఐఏఎస్ కావాలనేది నా కల. చదువుకోవడానికి సాయం చేయాలి. కొన్ని కారణాల వల్ల మా నాన్న చదువుకోలేక పోయారు. అందుకే నన్ను కష్టపడి చదివించారు. ఇక్కడ ఇంతమంది మాట్లాడినా నాకు ఏమీ అర్థం కాలేదు."
జంగా కీర్తన తండ్రి జంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ... "మాది చాలా పేద కుటుంబం. మా అమ్మాయికి వినపడదు. నా పనులు మానుకుని నా కూతురును చదివించాను. నీకు నేనే స్ఫూర్తి అని చెప్పాను 1 నుంచి 10 వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివించాను. ప్రతి రోజూ వెళ్లి ఉపాధ్యాయులను కలిసి నా కూతురు చదువు గురించి వాకబు చేసేవాడిని. వాట్సాప్ ద్వారా వారు బాగా మద్దతు ఇచ్చారు. నా కూతురుని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నా."





















