APECET-2021: ఏపీలో ఇంజనీరింగ్ ప్రవేశాలు షురూ.. వివరాలివే
Andhra Pradesh Engineering Common Entrance Test: ఏపీలో ఈసెట్ -2021 నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 12తో ముగియనుంది. దరఖాస్తు ఫీజు, పరీక్ష తేదీ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- AP ECET) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తుల స్వీకరణ ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుముతో ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్ పరీక్షను సెప్టెంబర్ 19న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ ఈసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (APSCHE) తరఫున అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తోంది. కాగా, తెలంగాణలో ఈసెట్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈసెట్ పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించనున్నారు.

ఏపీ ఈసెట్ పరీక్ష ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ బీఎస్సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణత సాధించిన వారు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన వారికి బీఫార్మసీ సెకండ్ ఇయర్లో ప్రవేశాలు లభిస్తాయి.
ముఖ్యమైన వివరాలు..
దరఖాస్తులకు ఆఖరు తేదీ: ఆగస్టు 12, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, బీసీ అభ్యర్థులు రూ.550, ఓసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్య రుసముతో దరఖాస్తులకు ఆఖరు తేదీ: ఆగస్టు 23, 2021
దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం: ఆగస్టు 18 నుంచి ఆగస్టు 20, 2021
హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: సెప్టెంబర్ 9, 2021
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 19, 2021
పరీక్ష సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 & మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ప్రిలిమనరీ కీ విడుదల: సెప్టెంబర్ 20, 2021
ప్రిలిమనరీ కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు: సెప్టెంబర్ 23, 2021
ఫైనల్ కీ విడుదల: అక్టోబర్ 1, 2021
ఫలితాల విడుదల: అక్టోబర్ 1, 2021
ర్యాంకు కార్డుల డౌన్లోడ్: అక్టోబర్ 5, 2021
దరఖాస్తు చేసుకోండిలా..
- దరఖాస్తుల రిజిస్ట్రేషన్, సబ్మిట్ చేయడానికి అభ్యర్థులు http://www.sche.ap.gov.in/ecet వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
- అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో నమోదు చేయాలి.
- ఆధార్ కార్డు నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫీజును ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా చెల్లించాలి.
పరీక్ష విధానం..
ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలకు (200 మార్కులు) ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (50 మార్కులు), ఫిజిక్స్ (25 మార్కులు), కెమిస్ట్రీ (25 మార్కులు), ఇంజనీరింగ్ పేపర్ (100 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు అందరికీ ఒకేలా (కామన్గా) ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్ మాత్రం అభ్యర్థి బ్రాంచ్ మీద ఆధారపడి ఉంటుంది.
బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు మ్యాథ్స్ (100 మార్కులు), అనలిటకల్ ఎబిలిటీ (50 మార్కులు), కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. ఇక ఫార్మసీ విభాగం వారికి ఫార్మాస్యూటిక్స్ (50 మార్కులు), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (50 మార్కులు), ఫార్మకోగ్నసీ (50 మార్కులు), ఫార్మకాలజీ & టాక్సికాలజీ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి.
Before You Go
MLC Kavitha on Dress Sense : హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళాకళాశాలలో కవిత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















