Selfie Deaths: వాటర్ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
సెలవుల్లో గ్రామానికి వచ్చిన ఫ్రెండ్తో కలిసి ముగ్గురు బాలికలు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మలుంగుమ్మి వాటర్ఫాల్స్ వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది.

Malungummi Waterfall | హుకుంపేట: సెల్ఫీ సరదా ముగ్గురు టీనేజ్ బాలికల ప్రాణాలు బలిగొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం నాడు ఈ విషాదం నెలకొంది. సెలవుల్లో సరదాగా గడుపుదామని వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన నలుగురు స్నేహితురాళ్లలో ముగ్గురు సెల్ఫీ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. హుకుంపేట మండలం జంబువలస గ్రామానికి చెందిన సాలేపు త్రిష (17), సాలేపు పవిత్ర (16), సాలేపు రత్నకుమారి (16), అంజలి అనే నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అనంతగిరి మండలం మలుంగుమ్మి వాటర్ఫాల్స్ సందర్శనకు వెళ్లారు.
ప్రాణాలు తీసిన సెల్ఫీలు..
మొదటవారు మలుంగుమ్మి వాటర్ ఫాల్స్ వద్ద కొండ అంచున నిలబడి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. వేసవికాలం కావడంతో నీళ్లలో సరదాగా సమయం గడుపుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. గట్టున ఉన్న స్నేహితురాలు ఫొటోలు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒకరు జారి నీటిలో పడిపోగా, ఆమెను కాపాడబోయి మిగతా ముగ్గురు కూడా ఒకరి వెనుక ఒకరు జలపాతంలోకి జారిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లలోకి దిగి వారిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే త్రిష, రత్నకుమారి, పవిత్ర ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మొదట గట్టున ఉండి, చివర్లో నీళ్లలోకి దిగినట్లు భావిస్తున్న అంజలి గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
మృతుల్లో త్రిష ఇంటర్ పరీక్షలు రాసి సెలవులకు గ్రామానికి వచ్చింది. పవిత్ర, రత్నకుమారి పదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. మరణించిన ముగ్గురు బాలికలు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమార్తెలు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు నీళ్లలో సరదాగా కేరింతలు కొట్టిన బాలికలు ఇక ప్రాణాలతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జలాశయాల వద్ద జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమే..
ప్రమాదకర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకుంటూ యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని అప్రమత్తం చేశారు. ఈత రాని వారు నీటి ఒడ్డున ఉండాలి కానీ లోతు ఎక్కువగా ఉన్న చోట జలాశయాల్లోకి దిగడం ప్రాణాలకు ప్రమాదమని పేర్కొన్నారు. నీళ్లలోకి దిగేటప్పుడు మునిగిపోకుండా ఉండేందుకు ట్యూబ్ లాంటివి వెంట తెచ్చుకోవడం మంచిదని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయని, వేసవికాలం కావడంతో బావులు, చెరువులు, వాటర్ ఫాల్స్ వద్ద మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
ట్రెండింగ్ వార్తలు























