First Night Crime: హైదరాబాద్లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
పెళ్లయిన కొన్ని గంటలకే భర్త తన వక్రబుద్ధి బయటపెట్టాడు. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Hyderabad Crime News | హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, జీవితాంతం తోడుంటాడని నమ్మి తాళి కట్టించుకున్న ఆ యువతికి మొదటి రోజే నరకం కనిపించింది. రక్షణగా ఉండాల్సిన భర్తే కామాంధుడిగా మారి, తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది బేగంపేటలో జరిగిన ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
బాధిత యువతి తన తల్లి, సోదరితో కలిసి కూకట్పల్లిలో నివసిస్తోంది. వీరి ఇంట్లో నెల్లూరుకు చెందిన ఒక యువకుడు అద్దెకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. కొంత కాలం తరువాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 28న కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన మరుసటి రోజే బేగంపేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న భర్త, అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.
మద్యం తాగించి గ్యాంగ్ రేప్
పెళ్లి వేడుకల పేరుతో భర్త తన ఐదుగురు స్నేహితులను ఇంటికి పిలిపించాడు. అక్కడ వారందరూ కలిసి మద్యం సేవించడమే కాకుండా, ఫస్ట్ నైట్ కు ముందు బాధితురాలికి కూడా బలవంతంగా మద్యం తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత భర్తతో పాటు అతడి స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిని, సోదరిని చంపేస్తామని నిందితులు బెదిరించారు. దాంతో కుటుంబసభ్యుల ప్రాణాలు తీస్తారని భయపడి ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించింది. ఇన్నాళ్లూ ఆమె మౌనంగా భరించిన బాధితురాలు చివరకు దైర్యం తెచ్చుకుని కుటుంబసభ్యులకు విషయం చెప్పి, వారి సాయంతో కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఈ ఘటన బేగంపేటలో జరిగిందని, ఆ పీఎస్ కు కేసు ట్రాన్స్ఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో పాటు పరారీలో ఉన్న అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























