ఇటీవల బంగారంతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దాంతో వరుసగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ పెట్టుబడిదారులతో పాటు ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు సైతం బంగారం, వెండి, రాగిపై తమ నగదు విత్ డ్రా చేసుకున్నారు. దాంతో ధరలు ఒక్కసారిగా మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో సోమవారం మళ్లీ ధరలలో జోష్ కనిపించింది. MCX సిల్వర్ ఫ్యూచర్స్ ప్రస్తుతం కిలోకు ₹2,50,000 నుండి ₹2,70,000 రేంజ్లో ఉంది. అయితే గత నెలాఖరులో వెండి కిలో ధర దాదాపు ₹4,20,000 గరిష్ట స్థాయికి తాకింది. త్వరలో వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. త్వరలో వెండి కేజీ ధర 3 లక్షల నుంచి ₹ 3,25,000 (3 లక్షల 25 వేలకు) వరకు పెరిగే అవకాశం ఉంది.
పెట్టుబడిదారులు ఏమి చేయాలి?
పెట్టుబడి పరంగా, ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు, ప్రస్తుతానికి హోల్డ్ చేయడం మంచిదని భావించవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో బంగారం స్థిరమైన, సురక్షితమైన రాబడిని అందిస్తుంది. కొత్త పెట్టుబడిదారులు ఇంకా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారు ధరలలో పతనం కోసం వేచి ఉండాలి, కానీ మొత్తం డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదని సూచించారు.
బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయి నుండి దిగొచ్చాయి. వెండి రికార్డు స్థాయిలో 4 లక్షలు మార్క్ దాటినా మళ్లీ 2.8 లక్షలకు పతనమైంది. అనిశ్చితి కారణంగా వెండిలో పెట్టుబడులపై నిపుణులు సైతం క్లారిటీగా చెప్పడం లేదు. అమెరికన్ డాలర్ బలహీనపడటం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అమెరికా మార్కెట్కు సంబంధించిన డేటా కోసం వెయిట్ చేయడం కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసి డాలర్ కు ప్రత్యామ్నాయంగా నగదు విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

























